‘ఆచార్య’కు 18 కోట్ల అదనపు ఆదాయం?

తెలుగు ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ లాస్ట్ వెంచర్ అంటూ ‘ఆచార్య’ గురించి వార్తలు వస్తుంటే.. ఈ అదనపు ఆదాయం ఏంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? ఇదే ఇప్పుడు ట్విస్టు. ఈ చిత్రం రిలీజ్ కంటే ముందే ఓటీటీ డీల్ పూర్తి చేసుకుంది. అమేజాన్ ప్రైమ్ వాళ్లు మంచి రేటుకే సినిమాను కొన్నారు.

రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ప్రైమ్‌లో డిజిటల్ రిలీజ్ చేయాలన్నది ముందు జరిగిన ఒప్పందం. చిరు చివరి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’కి ప్రైమ్‌లో అద్భుతమైన స్పందన రావడం, అలాగే చరణ్ సినిమా ‘రంగస్థలం’ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకోవడం.. చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో మంచి ఊపులో ఉండటంతో ఈ చిత్రానికి భారీ రేటే పెట్టినట్లు తెలుస్తోంది ప్రైమ్ సంస్థ. ఐతే ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో డిజాస్టర్ అయింది. నెగెటివ్ టాక్‌తో మొదలైన సినిమా ఏ దశలోనూ పుంజుకోలేదు. వారం తిరిగేసరికి థియేట్రికల్ రన్ ముగిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మహా అయితే ఈ వీకెండ్లో కాస్త షేర్ రాబట్టవచ్చు.

వచ్చే సోమవారం నుంచి ‘ఆచార్య’ థియేటర్లలో నిలవడం కష్టమే. అలాంటపుడు డిజిటల్ రిలీజ్ కోసం ఇంకో మూడు వారాలు ఆగాల్సిన పని లేదు. అందుకే అమేజాన్ ప్రైమ్ వాళ్లతో డీల్ రివైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకో వారం ముందుగానే.. అంటే రిలీజైన మూడు వారాలకు సినిమాను ప్రైమ్‌లో రిలీజ్ చేసేయబోతున్నారట. ఇలా వారం గ్యాప్ తగ్గించినందుకు ‘ఆచార్య’ నిర్మాతలకు రూ.18 కోట్లు అదనపు ఆదాయం అందుతోందట. ప్రైమ్ వాళ్ల పాలసీ ప్రకారం ఇలా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

థియేటర్ల ద్వారా ఇప్పటికే ‘ఆచార్య’కు నామమాత్రంగా షేర్ వస్తోంది. ఇంకో పది రోజుల్లోపే ‘సర్కారు వారి పాట’ రిలీజవుతుండటంతో మూడు వారాలకు సినిమా థియేటర్లలో నిలిచే పరిస్థితి ఎంతమాత్రం లేదు. అలాంటపుడు డిజిటల్ రిలీజ్‌ను వారం ప్రి పోన్ చేయడం ద్వారా అదనపు ఆదాయం అందుతుంటే ఎందుకు వద్దనుకుంటారు. ఈ రకంగా నష్టాలు కొంత మేర భర్తీ చేసుకున్నట్లే. అందుకే ఈ డీల్‌కు ఓకే అన్నట్లు తెలుస్తోంది.