ఆచార్య OTT స్ట్రీమింగ్ – ఇంత త్వరగానా

ఆచార్య ఖాళీ థియేటర్ల పర్వం కొనసాగుతోంది. చాలా చోట్ల షోలు రద్దవుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మల్టీ ప్లెక్సుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. బ్యాడ్ టాక్ కి తోడు 354 రూపాయలు ప్లస్ అడిషనల్ బుకింగ్ ఛార్జ్ పెట్టుకుని చూసేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. దెబ్బకు డెఫిషిట్ అంతకంతా పెరుగుతోంది. దీంతో ముందు కాస్త ఆలస్యంగా ఓటిటి ప్రీమియర్ అనుకున్న నిర్మాతలు ఇప్పుడు మూడు వారాల విండోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 20 తర్వాత ఏ రోజైనా డేట్ ఫిక్స్ కావొచ్చు.

దీనికిగాను ముందు చేసుకున్న ఒప్పందంలోని అమౌంట్ తో పాటు అదనంగా 18 కోట్లు నిర్మాతకు సమకూరబోతున్నాయని తెలిసింది. వీటిని డిస్ట్రిబ్యూటర్ల నష్టపరిహానికి ఉపయోగిస్తారా లేదానేది ఇప్పుడే చెప్పలేం. నిజానికి ఆచార్య పరిస్థితి చూస్తుంటే ఈ ఇరవై ఒక్క రోజుల స్ట్రీమింగ్ కూడా లేటే. కాకపోతే మరీ అంత కన్నా తక్కువ గ్యాప్ అంటే మెగాస్టార్ రేంజ్ ని ఇంకా తగ్గించినట్టు అవుతుంది కాబట్టి ఇలా డిసైడ్ చేశారు కాబోలు. రాధే శ్యామ్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయిపోయి ఎర్లీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

థియేటర్లో చూసినవాళ్లు పెద్దగా లేరు కాబట్టి ఆచార్యకు డిజిటల్ లో భారీ వ్యూస్ దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి. చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ ని బిగ్ స్క్రీన్ మీద చూడలేకపోయినా ఇంట్లోనే తాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే అప్పుడు ఎలాంటి అభిప్రాయాలు వస్తాయో చూడాలి. ఇదింకా అధికారికంగా ప్రకటించలేదు కానీ నమ్మదగిన విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు నిజమయ్యే ఛాన్స్ ఉంది. సో ఆచార్య కనీసం స్మార్ట్ స్క్రీన్ మీద మేజిక్ చేస్తాడేమో చూడాలి