‘ఆచార్య’కు థియేటర్ల సమస్య?

బామ్మర్ది బామ్మర్దే.. పేకాట పేకాటే అంటూ ఒక సామెతను వినే ఉంటారు. వ్యక్తిగతంగా ఎంత బంధం ఉన్నప్పటికీ.. ఆర్థిక ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి తమ స్వార్థమే చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ సామెతను వాడుతుంటారు. సినీ రంగంలోనూ ఈ సూత్రాన్ని చాలామంది పాటిస్తుంటారు. దిల్ రాజు కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకు మెగా ఫ్యామిలీ హీరోలందరితోనూ మంచి అనుబంధం ఉంది.

చిరంజీవి మీద ఎంతో అభిమానం, గౌరవం చూపిస్తుంటారు. అలాంటి వ్యక్తి చిరు కెరీర్లో ఎంతో ప్రత్యేకం అనదగ్గ ‘ఆచార్య’ సినిమాకు థియేటర్ల విషయంలో ఇబ్బందులు సృష్టిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నైజాం ఏరియాలో రాజు ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ కొన్నేళ్ల కిందట డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చిన వరంగల్ శ్రీను కొన్ని పెద్ద చిత్రాలను దక్కించుకుని రాజుకు పోటీ ఇవ్వడం తెలిసిందే.

ఐతే ఎక్కడ తాను ఎదిగిపోతానో అని తన చిత్రాలకు థియేటర్లు చాలినన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు ఇంతకుముందే ఒకసారి శ్రీను ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఈ శ్రీనునే ‘ఆచార్య’ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు తెలంగాణలో. భారీ రేటు పెట్టి సినిమాను కొన్న అతడికి థియేటర్ల దగ్గర సమస్య ఎదురవుతోందట. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ‘కేజీఎఫ్-2’ను దిల్ రాజు రిలీజ్ చేశాడు. దీని మీద ఆయనా భారీగానే పెట్టుబడి పెట్టాడు. ఇప్పటికే దాదాపుగా సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కానీ రెండో వారంలోనూ ఆ సినిమా బాగానే ఆడుతోంది.

ఈ వీకెండ్లోనూ మంచి షేర్ వస్తుందని రాజు భావిస్తున్నాడు. ఐతే ‘ఆచార్య’ను మెజారిటీ థియేటర్లలో రిలీజ్ చేసి వీకెండ్లో వీలైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టాలని చూస్తున్న శ్రీనుకు.. సింగిల్ స్క్రీన్లు చాలినన్ని ఇవ్వట్లేదట. రాజు చేతుల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ల నుంచి ‘కేజీఎఫ్-2’ను తీయడానికి ఆయన ఒప్పుకోవట్లేదని.. రాబోతున్నది చిరంజీవి సినిమా అయినా సరే ఆయన థియేటర్లు వదలట్లేదని.. దీని మీద పంచాయితీ నడుస్తోందని సమాచారం. ఇక చిరంజీవి స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప ‘ఆచార్య’కు కోరుకున్నన్ని థియేటర్లు దక్కే పరిస్థితి లేదంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.