‘ఆచార్య’కు జగన్ గిఫ్ట్ ఉంటుందా?

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది తగ్గించేసిన టికెట్ల రేట్లను ఈ మధ్యే మళ్లీ పెంచిన సంగతి తెలిసిందే. సాధారణ స్థాయిలో రేట్లు పెంచడంతో పాటు పెద్ద సినిమాలకు రిలీజైన తొలి పది రోజుల్లోనూ అదనంగా ధరలు పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది జగన్ సర్కారు. కాకపోతే ఇక్కడ కొన్ని మెలికలు ఉన్నాయి. పెద్ద సినిమాకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం ఇక్కడ కీలకం. హీరో హీరోయిన్లు, దర్శకుడి పారితోషకం కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకే రేట్ల పెంపు వర్తిస్తుంది.

ఐతే ఈ నిబంధన అమలు సజావుగా సాగుతుందా లేదా అనే విషయంలో ముందు నుంచి సందేహాలున్నాయి. ఎందుకంటే హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషకం ఎంత.. అవి పోగా బడ్జెట్ వంద కోట్లు దాటిందని నిర్ధరించేది ఎవరు అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్. తమకు అనుకూలమైన వారికి, తమను ఇంప్రెస్ చేసే వారికి మాత్రమే రేట్ల పెంపు అవకాశం కల్పించేలా.. మొత్తంగా ఇండస్ట్రీ జనాలను తమ చెప్పు చేతల్లో ఉంచుకునేలా ఉద్దేశపూర్వకంగానే ఈ షరతు పెట్టారనే అభిప్రాయం వ్యక్తమైంది.

అందుకు తగ్గట్లే రిలీజ్ ముంగిట తమను ‘రాధేశ్యామ్’ టీంలో ఎవ్వరూ కలవకపోవడంతో ఓ మోస్తరుగానే రేట్ల పెంపుకు ఛాన్స్ ఇచ్చి, సీఎంను కలిసి విన్నపాలు చేసుకున్న రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు భారీగా ధరలు పెంచుకునే అవకావం కల్పించారన్నది స్పష్టం. రేప్పొద్దున పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ రిలీజైతే అది రేట్ల పెంపు కేటగిరీలో వచ్చే సినిమానే అయినప్పటికీ.. ఏదో ఒక మెలిక పెట్టి దానికి రేట్లు పెంచుకునే ఛాన్స్ లేకుండా చేస్తారన్నది గ్యారెంటీ. భవిష్యత్ సంగతి పక్కన పెడితే చిరంజీవి సినిమా ‘ఆచార్య’కు ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పారితోషకాలను పక్కన పెడితే ఈ చిత్రం రూ.100 కోట్ల బడ్జెట్ దాటలేదు. కానీ జగన్‌ను చిరంజీవి వివిధ సందర్భాల్లో ఎలా కొనియాడారో, ఆయన్ని పలుమార్లు కలిసి ఇండస్ట్రీ తరఫున ఎలా విన్నపాలు చేశారో తెలిసిందే. చివరికి తీవ్ర విమర్శలు వ్యక్తమైన మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలోనూ చిరు జగన్‌ను సమర్థించారు. మరోవైపు ‘ఆచార్య’ నిర్మాత నిరంజన్ రెడ్డి జగన్‌ అక్రమాస్తుల కేసులో లాయర్ అన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే రేట్ల పెంపు కేటగిరీలోకి రాకున్నా ‘ఆచార్య’కు ఆ అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే జగన్ సర్కారు ద్వంద్వ ప్రమాణాలు మరోసారి బయటపడనున్నట్లే.