ఆచార్య సినిమా.. చ‌ర‌ణ్‌ ఆమెతో క‌లిసి చూడాలట‌

తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌ల‌ను ఫుల్ లెంగ్త్ సినిమాలో చూడ‌బోతున్నాం. వీరి క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన ఆచార్య ఇంకో ఎనిమిది రోజుల్లోనే థియేట‌ర్ల‌లోకి దిగ‌బోతోంది. వీరి క‌ల‌యిక‌లో సినిమా కోసం అభిమానులే కాదు.. మెగా కుటుంబ స‌భ్యులు కూడా ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూశారు. ఈ తండ్రీకొడుకుల‌ను చూడ‌టానికి ఆ కుటుంబంలోని అంద‌రూ కూడా ఎగ్జైట్మెంట్‌తో ఉంటార‌న‌డంలో సందేహం లేదు.

ఐతే ఈ సినిమాను తాను క‌చ్చితంగా ఓ వ్య‌క్తితో క‌లిసి చూడాల‌ని అంటున్నాడు చ‌ర‌ణ్‌. ఆ వ్య‌క్తి చ‌ర‌ణ్ నానమ్మ‌, చిరంజీవి తల్లి అంజ‌నా దేవి కావ‌డం విశేషం. ఆచార్య ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో క‌లిసి ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చ‌ర‌ణ్ ఈ కోరిక‌ను వెల్ల‌డించాడు. ఆచార్య సినిమాను తాను, త‌న తల్లిదండ్రులు, అలాగే త‌న నాన‌మ్మ అంజ‌నా దేవితో క‌లిసి చూడ‌టం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్లు చ‌ర‌ణ్ చెప్పాడు.

అప్పుడు నా కొడుకు ఎలా చేశాడో చూశావా అంటూ త‌న నాన‌మ్మ‌, త‌న త‌ల్లిని క‌వ్విస్తుంద‌ని.. ఆ దృశ్యం చూడాల‌ని కోరుకుంటున్నాన‌ని చ‌ర‌ణ్ అన్నాడు. ఈ సినిమాలో తాను, త‌న తండ్రి క‌లిసి డ్యాన్స్ చేసిన బంజారా పాట చిత్రీక‌ర‌ణ‌కు వాళ్లిద్ద‌రూ హాజ‌ర‌య్యార‌ని.. అప్పుడు కూడా నా కొడుకు బాగా చేశాడంటే నా కొడుకు బాగా చేశాడ‌ని ఇద్ద‌రూ వాదించుకున్నార‌ని చ‌రణ్ చెప్ప‌డం విశేషం.

ఇక తాను, నాన్న క‌లిసి సినిమా చేస్తే చూడాల‌ని అత్యంత ఆశ‌ప‌డింది త‌న త‌ల్లే అని.. ఆమె కోరిక నెర‌వేర్చ‌డానికే తామిద్ద‌రం ఆచార్య సినిమాలో క‌లిసి న‌టించామ‌ని చ‌ర‌ణ్ తెలిపాడు. చిరు స‌ర‌స‌న కాజ‌ల్, చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టించిన ఆచార్య ఈ నెల 29న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.