ఓటీటీలో రిలీజ్ చేశామా.. వదిలేశామా

OTT

థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజయ్యే సినిమాలంటే జనాలకు నెమ్మదిగా చిన్న చూపు వచ్చేస్తోంది. వాటి పట్ల నెగెటివ్ ఫీలింగ్ పడిపోతోంది. అంతగా విషయం లేని, బాక్సాఫీస్ సక్సెస్ మీద భరోసా లేని నిర్మాతలే తమ చిత్రాల్ని ఓటీటీల్లోకి వదిలేస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది.

ఓటీటీ రిలీజెస్‌లో కాస్త ఎక్కువ అంచనాలు, ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’ సైతం నిరాశకు గురి చేయడంతో జనాలు ఈ సినిమాలపై ఆశలు వదిలేసుకుంటున్నారు. ఈ సినిమాల వల్ల ఓటీటీలకు ఏమేరకు లాభం చేకూరుతోంది అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. అక్కడేమీ ‘పే పర్ వ్యూ’ లెక్కన సినిమాలు చూపించట్లేదు. వార్షిక సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే పాత, కొత్త అని తేడా లేకుండా ఏ సినిమా అయినా చూడొచ్చు.

ఈ కొత్త సినిమాల వల్ల ఓటీటీలకు కొత్త సబ్‌స్క్రిప్షన్లు ఏమేర పెరుగుతున్నాయన్నది ప్రశ్న. జ్యోతిక సినిమా ‘పొన్‌మగల్ వందాల్’ను రూ.7 కోట్ల దాకా పెట్టి కొనుగోలు చేసిందట అమేజాన్. మరి కనీసం 70 వేల మంది కొత్తగా సబ్‌స్కిప్షన్ తీసుకుంటే తప్ప వాళ్లకు ఈ సినిమాతో వర్కవుట్ అయినట్లు కాదు. కానీ అలా జరిగి ఉంటుందా అన్నది సందేహమే. ఇదిలా ఉంటే.. కొత్త సినిమాలు రిలీజ్ చేస్తూ వాటిని ప్రమోట్ చేసే బాధ్యత కూడా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్సే తీసుకుంటున్నాయి.

మొన్న ‘పెంగ్విన్’ రిలీజ్ టైంలో అమేజాన్ ప్రైమ్ వాళ్లు పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తూ ప్రమోట్ చేశారు. కానీ నిర్మాతలు మాత్రం ఒక్క రూపాయి పెట్టలేదు. సినిమాను అమ్మేశామా.. రిలీజ్ ముంగిట టీజర్, ట్రైలర్ ఆన్ లైన్లో వదిలామా.. కొన్ని ట్వీట్లు వేశామా.. అంతే అన్నట్లుంది వ్యవహారం. సినిమా విడుదలయ్యాక అసలేమాత్రం వాళ్ల వైపు నుంచి ప్రమోషన్ లేదు.

ముందు కూడా యాడ్స్ ఏమీ ఇవ్వలేదు. అవన్నీ ఓటీటీ వాళ్లే చూసుకుంటున్నారు. చూస్తుంటే ఇదే లాభసాటి వ్యవహారంలా ఉందని, లాభం తగ్గినా తలనొప్పులేమీ లేవని, పైగా భారం దిగిపోతుందని మిగతా నిర్మాతలు ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది.