‘జెర్సీ’ మేకర్స్‌లో భయం

బాలీవుడ్లో ఈ మధ్య విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ సినిమాలపై పెట్టుకున్న అంచనాలు తారుమారు అయిపోతున్నాయి. బాగా ఆడతాయనుకున్న సినిమాలు దెబ్బ తింటున్నాయి. అంచనాల్లేని సినిమాలు అనూహ్యంగా ఆడేస్తున్నాయి. ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సినిమాలను అంచనాల్లేని సినిమాలు దెబ్బ కొడుతుండటం ఇక్కడ చర్చనీయాంశం. డిసెంబరులో ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూసింది ‘83’ సినిమా కోసమే. అది 1983 వరల్డ్ కప్ విజయం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా, పైగా రణ్వీర్ సింగ్-దీపికా పదుకొనే సహా భారీ తారాగణం నటించిన చిత్రం, కబీర్ ఖాన్ లాంటి పెద్ద దర్శకుడు రూపొందించాడు.

కానీ ఈ భారీ అంచనాలున్న సినిమా.. ఏదో మొక్కుబడిగా రిలీజవుతున్నట్లు కనిపించిన ‘పుష్ప’ దెబ్బకు విలవిలలాడింది. మంచి టాక్ తెచ్చుకున్న  ‘83’ని పక్కకు నెట్టేసి ఆ సినిమా ఉత్తరాది బాక్సాఫీస్‌ను ఊపేసింది. భారీ వసూళ్లు తెచ్చుకుంది.ఆ తర్వాతేమో ‘కశ్మీర్ ఫైల్స్’ అనే చిన్న సినిమా అక్కడ సంచలనం రేపింది. అందరూ మార్చిలో అక్షయ్ కుమార్ సినిమా ‘బచ్చన్ పాండే’ కోసం ఎదురు చూస్తుంటే.. వారం ముందు వచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్‌లో లీడ్ తీసుకుంది. దాని దెబ్బకు ‘బచ్చన్ పాండే’ నిలవలేకపోయింది.

ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ వచ్చి ‘బచ్చన్ పాండే’ అడ్రస్ గల్లంతయ్యేలా చేసింది. ఈ సౌత్ సినిమా ధాటికి జాన్ అబ్రహాం నటించిన భారీ చిత్రం ‘ఎటాక్’ పరిస్థితి దారుణంగా తయారైంది. సరైన ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 14న రిలీజ్ కాబోయే రెండు సినిమాలపై పడింది.

ఆ రోజు హిందీ ‘జెర్సీ’తో పాటు కన్నడ అనువాద చిత్రం ‘కేజీఎఫ్-2’ కూడా రిలీజవుతోంది. ఇప్పటిదాకా ట్రెండ్‌ను గమనిస్తే క్లాస్ సినిమాలకు బాలీవుడ్లో ఇప్పుడు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. సౌత్ నుంచి వచ్చే మాస్ మసాలా, యాక్షన్ సినిమాలకే పట్టం కడుతున్నారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ‘జెర్సీ’కి ‘కేజీఎఫ్-2’ నుంచి ముప్పు తప్పదేమో అని ట్రేడ్ పండిట్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి రిలీజ్ అవుతున్న ‘జెర్సీ’ నిర్మాతలకు ఎలాంటి అనుభవం మిగులుస్తుందో చూడాలి మరి.