పేరు తెచ్చిన సినిమానే న‌చ్చ‌ద‌ట‌

సాయిమాధ‌వ్ బుర్రా.. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ రైట‌ర్ల‌లో ఒక‌డు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌నే ఇప్పుడు తెలుగులో నంబ‌ర్ వ‌న్ ర‌చ‌యిత అని కూడా చెప్పొచ్చు. తాజాగా ఆయ‌న ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రానికి సంభాష‌ణ‌లు అందించారు. దీని కంటే కృష్ణం వందే జ‌గ‌ద్గురుం, మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, ఖైదీ నంబ‌ర్ 150, సైరా న‌ర‌సింహారెడ్డి.. ఇలా ఎన్నో సినిమాలు ఆయ‌న మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఐతే ఇందులో సాయిమాధ‌వ్‌కు కెరీర్ ఆరంభంలో గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో మళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు ఒక‌టి. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్-నిత్యా మీన‌న్ జంట‌గా న‌టించిన ఆ చిత్రంలో డైలాగ్స్ చాలా గొప్ప‌గా ఉంటాయి. ఐతే సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న‌ప్ప‌టికీ.. క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్నంత విజ‌యం సాధించ‌లేదు. మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు త‌న‌కు ర‌చ‌యిత‌గా మంచి పేరు తెచ్చిన‌ప్ప‌టికీ.. త‌న‌కా సినిమా న‌చ్చ‌ద‌ని సాయిమాధ‌వ్ తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం విశేషం.

ఇందుకు కార‌ణం కూడా ఆయ‌న వివ‌రించారు. ఆ సినిమా నిండా డైలాగులే ఉంటాయి త‌ప్ప‌.. ఇంకేమీ ఉన్న‌ట్లు అనిపించ‌ద‌ని సాయిమాధ‌వ్ చెప్పారు. ప్ర‌తి స‌న్నివేశంలోనూ ఇద్ద‌రు నిల‌బ‌డి మాట్లాడుకుంటూ ఉంటార‌ని.. సినిమా నిండా ఇలా డైలాగులు మాత్ర‌మే ఉంటే ఎలా అని సాయిమాధ‌వ్ అన్నారు. ఆ సినిమాకు తాను ఎంతో ఇష్ట‌ప‌డి, మంచి డైలాగులే రాశాన‌ని.. త‌న మాట‌లు త‌న‌కు న‌చ్చినా సినిమా మాత్రం న‌చ్చ‌లేదంటూ నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయాన్ని చెప్పారు సాయిమాధ‌వ్.

ఇక ఆర్ఆర్ఆర్ గురించి చెబుతూ.. ఈ సినిమాతో రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగాడ‌ని.. ప్ర‌తి స‌న్నివేశంలోనూ క‌థ‌ను, పాత్ర‌ల వ్య‌క్తిత్వాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడ‌ని.. హీరోలిద్ద‌రూ క‌లిసే స‌న్నివేశంలో నీరు, నిప్పుడు రెంటినీ క‌లిపి చూపించిన వైనం.. రామ్ పాత్ర ఆరంభ స‌న్నివేశంలో త‌న వ్య‌క్తిత్వాన్ని చాటేలా ఆ స‌న్నివేశాన్ని తీర్చిదిద్దిన తీరు అమోఘ‌మ‌ని ఆయ‌న జ‌క్క‌న్న‌ను కొనియాడారు.