‘నా పేరు సూర్య’ భారం ఇన్నాళ్లకు దిగింది

వక్కంతం వంశీ.. న్యూస్ రీడర్‌గా ప్రస్థానం ఆరంభించి, ఆ తర్వాత నటుడిగా అరంగేట్రం చేసి.. ఆపై రచయితగా మారి స్టార్ స్టేటస్ సంపాదించి.. చివరికి దర్శకుడిగా మారిన వ్యక్తి. ఐతే రచయితగా అంతగా పేరు లేని వాళ్లు కూడా దర్శకులుగా మారాక పెద్ద రేంజికి వెళ్లారు కానీ.. రైటర్‌గా తిరుగులేని ఇమేజ్ సంపాదించిన వక్కంతం వంశీ.. దర్శకుడిగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాతో దర్శకుడిగా మారాల్సిన అతను.. అనుకోకుండా ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడంతో ఇబ్బంది పడ్డాడు.

అయినా సరే అల్లు అర్జున్ లాంటి మరో పెద్ద హీరోతో దర్శకుడిగా తొలి చిత్రాన్ని ఓకే చేయించుకోగలిగాడు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంచనాలను అందుకోలేకపోయింది. తీసిపడేయదగ్గ సినిమా కాదు కానీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం ‘నా పేరు సూర్య’ విఫలమైంది. తొలి సినిమా డిజాస్టర్ కావడంతో వక్కంతం దర్శకత్వ ప్రయాణానికి పెద్ద బ్రేకే పడింది.

దాదాపు నాలుగేళ్లు సినిమా లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మధ్యలో కొన్ని కాంబినేషన్లు ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. చివరికి నితిన్‌తో ఓ సినిమా ఓకే అయిందని ఏడాది కిందట వార్తలొచ్చాయి. కానీ అది ఎంతకీ పట్టాలెక్కలేదు. ఇది కూడా వేరే చిత్రాల్లాగే క్యాన్సిల్ అవుతుందా అన్న అనుమానాలు కలిగాయి. ఐతే ఎట్టకేలకు వక్కంతం ప్రయత్నం ఫలించింది. నితిన్‌తో సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ ఆదివారమే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.

ఈ చిత్రాన్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తోంది. ఇందులో నితిన్ సరసన ‘పెళ్ళిసందడి’ భామ శ్రీలీల నటించనుంది. తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన హ్యారిస్ జైరాజ్ నితిన్-వంశీ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ మొత్తం కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేలాగే ఉంది. మరి ‘నా పేరు సూర్య’ భారాన్ని ఇంతకాలం మోసిన వక్కంతం.. దర్శకుడిగా తన రెండో సినిమాతో హిట్టు కొట్టి ఆ మరకలన్నీ పూర్తిగా చెరిపేస్తాడేమో చూడాలి.