రాజమౌళి చేసిన పొరపాటు

RRR Rajamouli

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’ను ‘బాహుబలి’తో పోల్చి చూడటం అనివార్యం. ఐతే అలా పోల్చి చూసినపుడు సినిమా అంత లేదు అనిపించొచ్చు కానీ.. అంచనాల కళ్ల జోడు తీసి చూస్తే మాత్రం ఇదేమీ ఆషామాషీ సినిమా కాదు. కథ పరంగా కొన్ని లోటు పాట్లు ఉన్నప్పటికీ.. రాజమౌళి నుంచి ఆశించే భారీతనం, హీరో ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాల విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ టాప్ క్లాస్ అనే చెప్పాలి.

ఇద్దరు స్టార్ హీరోల అభిమానులను సంతృప్తిపరిచే అద్భుతమైన ఎలివేషన్ సీన్లతో గూస్ బంప్స్ ఇచ్చాడు జక్కన్న. హీరో ఇంట్రో సీన్ల దగ్గర్నుంచి చెప్పుకుంటూ సినిమాలో హైలైట్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులకు సినిమాలో పెద్ద సర్ప్రైజ్ అంటే.. ఇంటర్వెల్ బ్లాక్‌లో స్కాట్ దొర కోట మీదికి భీమ్ జంతువుల దండుతో దాడి చేసే దృశ్యమే. ఈ సీన్లో ప్రేక్షకులు అలా నోరెళ్లి పెట్టి చూస్తూ ఉండిపోతారంతే. ఇలాంటి ఐడియాలు జక్కన్నకు తప్ప ఎవరికీ రావని, ఇది ఎలివేషన్లకే ఎలివేషన్ అని ఆయన్ని అందరూ కొనియాడుతున్నారు.

ఐతే ఈ సన్నివేశంలో ప్రేక్షకులను భలేగా సర్ప్రైజ్ చేసి ఔరా అనిపించిన జక్కన్న.. ఇంకో సన్నివేశంలోనూ ఇలాగే చేసి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రీ క్లైమాక్స్‌లో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు అవతారంలోకి మారి బ్రిటిష్ సైన్యం మీద దాడి చేసే సన్నివేశానికి మామలూగానే  అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. కాకపోతే ఇది మరీ సర్ప్రైజ్ అయితే కాదు. ముందే చరణ్‌ను అల్లూరి అవతారంలో చూపించేశారు.

ట్రైలర్లో కూడా ఈ షాట్ ఉంటుంది. అలా కాకుండా ఈ లుక్ ముందే రిలీజ్ చేయకుండా దాచి ఉంచి, ఈ షాట్‌ను కూడా ట్రైలర్లో పెట్టకుండా ఉండి ఉంటే కథ వేరుగా ఉండేది. ఇంటర్వెల్ బ్లాక్‌లో భీమ్ దాడి దృశ్యాన్ని దాచి పెట్టి ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చినట్లే.. అల్లూరి అవతారంలో రామ్ ప్రత్యర్థుల మీద పడే ఘట్టాన్ని కూడా దాచి పెట్టి నేరుగా వెండి తెర మీదే దాన్ని రివీల్ చేసి ఉంటే థియేటర్లలో ప్రేక్షకులు వెర్రెత్తిపోయి ఉండేవారు. ఆ సన్నివేశం సినిమాకే మేజర్ హైలైట్ అయ్యేది. ఈ విషయంలో జక్కన్న పొరపాటు చేశాడని విశ్లేషకులతో పాటు అభిమానులూ అభిప్రాయపడుతున్నారు.