తెలంగాణలో టికెట్లన్నీ ఔట్.. మరి ఏపీలో?

‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకో రెండు రోజులే మిగిలి ఉంది. తెలంగాణలో ఎక్కడా కూడా తొలి రోజుకు ఒక్క టికెట్ అందుబాటులో లేదు. ఆన్ లైన్లో తొలి రోజుకే కాదు.. తొలి వీకెండ్ మొత్తానికి టికెట్లన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి. బుక్ మై షో సహా అన్ని టికెటింగ్ యాప్స్‌లో అందుబాటులో ఉన్న అన్ని టికెట్లనూ పెట్టేయడం.. డిమాండ్ ఉన్న థియేటర్లలో నిమిషాల్లో టికెట్లు అమ్ముడైపోవడం జరిగిపోయింది. ఆన్ లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా ఇదే పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎప్పట్లాగే ఈ చిత్రానికి కూడా కన్ఫ్యూజన్ తప్పట్లేదు.

తెలంగాణలో వారం ముందు నుంచే బుకింగ్స్ అమ్మకాలు మొదలయ్యాయి. కొన్ని థియేటర్ల వరకు కాస్త ఆలస్యమైంది. మొత్తంగా తొలి వారాంతానికి మొత్తం టికెట్లు అమ్ముడైపోయినట్లే. కానీ ఏపీలో మంగళవారం నాటికి 20 శాతం థియేటర్లలో కూడా బుకింగ్స్ జరగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గత ఏడాది ‘వకీల్ సాబ్’కు ఉన్నట్లుండి టికెట్ల ధరలు తగ్గించి, అదనపు షోలు రద్దు చేసిన దగ్గర్నుంచి అక్కడ బుకింగ్స్ విషయంలో గందరగోళం తప్పట్లేదు.

ఈ మధ్య టికెట్ల రేట్లు పెంచుతూ కొత్త జీవో ఇచ్చినా కన్ఫ్యూజన్ తప్పట్లేదు. ‘రాధేశ్యామ్’ సినిమాకు రేట్లు, అదనపు షోల విషయంలో ఒక స్పష్టత లేక విడుదల ముందు రోజు కూడా చాలా చోట్ల బుకింగ్స్ మొదలుపెట్టని పరిస్థితి. ఆ రోజు పొద్దు పోయాక కానీ.. ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు మొదలు కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో రాజమౌళి టీం ముందే వెళ్లి ఏపీ సీఎంను కలిసి రేట్లు, షోల పెంపు కోసం అనుమతులు తెచ్చుకోవడంతో ముందే బుకింగ్స్ మొదలవుతాయని అనుకున్నారు.

కానీ అలాంటిదేమీ జరగలేదు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి లాంటి కొన్ని నగరాల్లో కొన్ని థియేటర్ల వరకే బుకింగ్స్ మొదలుపెట్టారు. టికెట్లు సోల్డ్ ఔట్ అయిపోయాయి. మిగతా జిల్లాల్లో చాలా చోట్ల ఆన్ లైన్ బుకింగ్స్ మంగళవారం రాత్రికి కూడా మొదలు కాలేదు. ఆన్ లైన్ రేట్లు, షోల విషయంలో గందరగోళం కారణంగా కొన్ని చోట్ల థియేటర్ల దగ్గర కౌంటర్ బుకింగ్స్ పెట్టి తమకు నచ్చిన రేట్లకు అమ్ముకుంటున్నారు. మిగతా వాళ్లు బుధవారం ఆన్ లైన్లో టికెట్లు అందుబాటులోకి తెచ్చే అవకాశముంది.