‘ఆర్ఆర్ఆర్’ చూశాక అలా ఫీలవరు-రాజమౌళి

‘బాహుబలి’ రెండు భాగాలూ పూర్తి చేయడానికి రాజమౌళికి ఐదేళ్ల సమయం పట్టింది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు అంత సమయం వెచ్చించడం పట్ల అభిమానుల్లో కొంత అసంతృప్తి కనిపించింది. మరీ ఒక ప్రాజెక్టు కోసం ఇంత టైమా అన్నారు. కానీ ‘బాహుబలి’ చూశాక అభిప్రాయాలన్నీ మారిపోయాయి. ఇలాంటి సినిమాకు అంత టైం పెట్టడంలో తప్పేమీ లేదనిపించింది. బాహుబలి-2 రిలీజ్ తర్వాత ప్రభాస్ మార్కెట్ ఎంతగా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడిక రాజమౌళి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ రాబోతోంది. ప్రభాస్ అయితే ‘బాహుబలి’కి ముందు మీడియం రేంజ్ హీరో. అతడికి ఆ చిత్రం గొప్పగా ఉపయోగపడింది.

కానీ తనతో పోలిస్తే ‘ఆర్ఆర్ఆర్’ చేయడానికి ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ చాలా పెద్ద స్టార్లు. కెరీర్ పీక్స్‌లో ఉన్నారు. ఇలాంటి టైంలో ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఇద్దరూ మూణ్నాలుగేళ్ల సమయం పెట్టారు. ఇంత పెద్ద స్టార్లను ఇంత కాలం లాక్ చేయడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇదే ప్రశ్నను ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా మంగళవారం తెలుగు మీడియాను కలిసిన రాజమౌళిని అడిగారు విలేకరులు. ప్రైమ్ టైంలో హీరోల నుంచి ఇంత సమయం తీసుకున్నారే అని రాజమౌళిని అడిగితే దానికాయన బదులిస్తూ.. ‘‘సినిమా చూశాక హీరోలు ఇంత టైం పెట్టడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఎంతమాత్రం కలగదు. సినిమా చూస్తున్నంతసేపూ ఇలాంటి సినిమాకు ఎంత సమయం అయినా వెచ్చించొచ్చు అనిపిస్తుంది. నా దృష్టిలో ‘ఆర్ఆర్ఆర్’.. ‘బాహుబలి’ కన్నా పెద్ద సినిమా’’ అని జక్కన్న చెప్పాడు.

మధ్యలో తారక్ అందుకుని.. ‘‘ప్రైమ్ ఏంటండీ.. ఆకు చాటు పిందె చేసినపుడు తాతగారు 60 ప్లస్. నటులకు వయసు, ప్రైమ్ టైం అనేది ఉండదు’’ అన్నాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ బాగా ఆలస్యమై వడ్డీల భారం పెరిగిన నేపథ్యంలో హీరోలు రెమ్యూనరేషన్లేమైనా తగ్గించుకున్నారా అని జక్కన్నను అడిగితే.. ‘‘వీళ్లిద్దరూ ఇప్పటికే చాలా త్యాగాలు చేశారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో ఈ చిత్రం కోసం నాలుగేళ్ల సమయం వెచ్చించారు. కరోనా, ఇతర కారణాల వల్ల షూటింగ్ చాలా ఆలస్యమైనా ఓపిగ్గా ఎదురు చూశారు. విపరీతంగా కష్టపడ్డారు. ఇంకా రెమ్యూనరేషన్లు తగ్గించుకోవడం ఏంటి’’ అన్నాడు జక్కన్న.

తారక్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటి వాడని, మనమో లైన్ డైలాగ్ చెబితే, తర్వాతి రెండు లైన్లను ముందే అంచనా వేస్తాడని.. ఇక రామ్ చరణేమో తెల్ల కాగితం లాంటి వాడని, తనలో ఎంత ప్రతిభ ఉన్నా, అంతా పక్కన పెట్టి మనం ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంటాడని జక్కన్న విశ్లేషించాడు.