రానా-వెంకీ.. 8 గంటల వెబ్ సిరీస్

ఇంతకుముందు వెబ్ సిరీస్‌లు తమ స్థాయికి తగవన్నట్లుగా వాటిని దూరం పెట్టిన స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా ఇప్పుడు అటు వైపు చూస్తున్నారు. హిందీలో ఆల్రెడీ టాప్ స్టార్స్ వెబ్ సిరీస్‌ల్లో నటిస్తుండగా.. టాలీవుడ్ హీరోల్లోనూ కదలిక వస్తోంది. ఇటీవలే అక్కినేని నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘దూత’ అనే వెబ్ సిరీస్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీని కంటే ముందు వెంకటేష్-రానాల కలయికలో ఓ హిందీ వెబ్ సిరీస్ మొదలవడం తెలిసిందే. ఈ సిరీస్ గురించి కొన్ని నెలల ముందు అనౌన్స్‌మెంట్ వచ్చిందే తప్ప దాని గురించి పెద్దగా విశేషాలేమీ బయటికి రాలేదు.

దీని కోసం వెంకటేష్ సరికొత్త లుక్‌లోకి మారడం తెలిసిందే. అంతకుమించి వెంకీ పాత్ర గురించి కానీ.. రానా క్యారెక్టర్ గురించి కానీ ఏ సమాచారం లేదు. ఐతే ‘భీమ్లా నాయక్’ ప్రమోషన్లలో భాగంగా రానా ఈ సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘భీమ్లా నాయక్’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో తాను పాల్గొనకపోవడానికి ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉండటమే కారణమని రానా వెల్లడించాడు.

‘భీమ్లా నాయక్’ రిలీజ్ రోజు కూడా తాను ముంబయిలో షూట్‌లో పాల్గొన్నట్లు రానా వెల్లడించాడు. సాయంత్రం షూట్ ముగించుకున్నాక అక్కడే ‘భీమ్లానాయక్’ షో చూసినట్లు రానా తెలిపాడు. నెట్ ఫ్లిక్స్ సంస్థ చాలా పెద్ద స్థాయిలో ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు రానా వెల్లడించాడు. ఇది 8 గంటల నిడివితో సాగే సుదీర్ఘ వెబ్ సిరీస్ అని కూడా రానా తెలిపాడు. ఇండియాలో ఇంత నిడివితో రూపొందిన సిరీస్‌లు దాదాపు లేవనే చెప్పాలి.

చాలా వరకు 3-5 గంటల నిడివిలో సిరీస్‌లు అయిపోయేలా చూస్తారు. 8 గంటలంటే మన దగ్గర చాలా ఎక్కువ నిడివే. దీన్ని బట్టి ఇది చాలా పెద్ద స్థాయి సిరీస్ అనే విషయం అర్థమవుతోంది. మరి రానా, వెంకీ కలిసి ఈ భారీ వెబ్ సిరీస్‌లో ఎలా అభిమానులను మురిపిస్తారో చూడాలి. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనొవన్’ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. దీనికి ‘రానా నాయుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.