ర‌వితేజ‌కు ఇష్టం లేకుండానే దించేస్తున్నారా?

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ గ‌త ఏడాది క్రాక్‌తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ ఊపులో ఇంకొన్ని నెల‌ల‌కే ఖిలాడి సినిమాను దించాల‌నుకున్నాడు. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి అత‌డి ప్ర‌ణాళిక‌ల‌కు బ్రేక్ వేసింది. అనుకున్న స‌మ‌యం క‌న్నా దాదాపు ప‌ది నెల‌ల‌కు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు కూడా ఆ చిత్రానికి అంత అనుకూల ప‌రిస్థితులేమీ లేవు. క‌రోనా ప్ర‌భావం కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఈ నెల 11న ఖిలాడి మూవీని రిలీజ్ చేయాల‌ని ముందు అనుకున్నారు.

కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూ, 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీని కొన‌సాగిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో చిత్ర బృందంలో అయోమ‌యం నెల‌కొంది. ప్ర‌స్తుతానికి ఈ నెల 14 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌బోతోంది. ఆ త‌ర్వాత ప‌రిస్థితి ఏంటో తెలియ‌దు. నైట్ క‌ర్ఫ్యూ ఉంటే సెకండ్ షోల‌కు ఇబ్బంది. 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీ ఉఉన్నా కూడా క్రాక్ మూవీ భారీ వ‌సూళ్లు రాబ‌ట్టిన నేప‌థ్యంలో అదేమంత ఇబ్బంది కాద‌నుకుంటున్నారు.

కానీ సెకండ్ షోలు లేకుంటే మాత్రం వ‌సూళ్ల‌పై మ‌రింత ప్ర‌భావం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో సినిమాను ఇంకో వారం వాయిదా వేయాల‌ని ఒక ద‌శ‌లో చ‌ర్చ జ‌రిగింది. హీరో ర‌వితేజ ఆ విష‌యంలో కొంచెం ప‌ట్టుద‌ల‌తోనే ఉన్నాడ‌ట‌.

కానీ ఫిబ్ర‌వ‌రి 25కు మూణ్నాలుగు సినిమాలు షెడ్యూల్ అయి ఉండ‌టంతో ఖిలాడి ర‌న్ వారానికే ఆగిపోతుంద‌ని.. 11న రిలీజ్ చేస్తే రెండు వారాల పాటు పెద్ద‌గా పోటీ లేకుండా సినిమాను న‌డిపించుకోవ‌చ్చ‌ని, హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 25న వ‌చ్చే గంగూబాయి మూవీతో ఇబ్బంది ఉండ‌ద‌ని.. అందుకే ఏపీ సంగ‌తి ప‌క్క‌న పెట్టేసి సినిమాను 11నే రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు డిసైడైపోయారు. ఈ నేప‌థ్యంలో ర‌వితేజ‌కు ఇష్టం లేకున్నా 11న రిలీజ్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి అనుకున్న ప్ర‌కార‌మే సినిమా రిలీజ‌వుతుందే లేదో చూడాలి.