భీమ్లా నాయ‌క్ రిలీజ్‌పై నిర్మాత పంచ్‌

భీమ్లా నాయ‌క్ రిలీజ్ మీద స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రం వ‌స్తుంద‌న్న ఆశ‌లు ఇప్ప‌టికైతే పెద్ద‌గా లేవు. అలాగ‌ని ఆ అవ‌కాశాన్ని కొట్టి పారేయ‌నూ లేం.  స్వ‌యంగా నిర్మాత‌లే ఫిబ్ర‌వ‌రి 25న కుదిరితే తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తామ‌ని.. లేదంటే ఏప్రిల్ 1న ఈ చిత్రం రిలీజ‌వుతుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఫిబ్ర‌వ‌రి 25న ఈ సినిమా రాద‌న్న ధీమాతో ఆడ‌వాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియ‌న్ చిత్రాల‌కు రిలీజ్ ఖ‌రారు చేసేశారు.

త‌మిళ అనువాద చిత్రం వ‌లిమై కూడా అదే రోజు రాబోతోంది. ఐతే భీమ్లా నాయ‌క్ నిర్మాత‌లు మాత్రం ఈ ప‌రిణామాల‌పై ఏమీ స్పందించ‌ట్లేదు. ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బేన‌ర్లోనే డీజే టిల్లు అనే చిన్న సినిమా తెర‌కెక్కింది. ఈ చిత్ర ట్రైల‌ర్ లాంచ్‌కు వ‌చ్చిన నిర్మాత నాగ‌వంశీని మీడియా వాళ్లు భీమ్లా నాయ‌క్ రిలీజ్ గురించి అడిగారు. దానికాయ‌న ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు.

ఫిబ్ర‌వ‌రి 25న లేదా ఏప్రిల్ 1న రిలీజ్ అని తాము ఇప్ప‌టికే ప్ర‌క‌టించామ‌ని.. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని అడ‌గాల‌ని ఆయ‌న‌న్నారు. అదేంట‌ని అంటే.. ఏపీలో 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీ, నైట్ క‌ర్ఫ్యూ ఎప్పుడు తీసేస్తే అప్పుడు భీమ్లా నాయ‌క్ రిలీజ‌వుతుంద‌ని.. ఇది ప్ర‌భుత్వం చేతుల్లో ఉన్న నిర్ణ‌యం కాబ‌ట్టి భీమ్లా నాయ‌క్ రిలీజ్ సంగ‌తి జ‌గ‌న్‌నే అడ‌గాల‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశారు నాగ‌వంశీ.

పోయినేడాది ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్‌ను ఏపీ స‌ర్కారు టార్గెట్ చేసిన ద‌గ్గ‌ర్నుంచి ప‌వ‌ర్ స్టార్ అభిమానులు జ‌గ‌న్ మీద గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు నాగ వంశీ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి చూస్తే.. భీమ్లా నాయ‌క్‌ సినిమాకు ఏ ఇబ్బంది త‌లెత్తినా అది జ‌గ‌న్ స‌ర్కారు బాధ్య‌తే అన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. మ‌రి ఈ సినిమా రిలీజ్ టైంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.