స‌ర్కారు వారి పాట టీం రెడీ

సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన స‌ర్కారు వారి పాట వివిధ కార‌ణాల‌తో వాయిదా ప‌డ‌టం తెలిసిందే. పండ‌క్కి ఆర్ఆర్ఆర్ పోటీలో ఉండ‌టంతో పాటు షూటింగ్ ఆల‌స్యం అవుతుండ‌టంతో సినిమాను వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ఏప్రిల్ 1కి కొత్త డేట్ ఇచ్చారు. కానీ ఆ డేట్‌ను కూడా సినిమా అందుకోవ‌డం క‌ష్ట‌మే అన్న‌ట్లుంది ప‌రిస్థితి. ముందుగా మ‌హేష్ మోకాలి నొప్పి కార‌ణంగా కొన్నాళ్లు షూటింగ్ ఆగింది.

ఆ త‌ర్వాత అత‌ను క‌రోనా బారిన ప‌డ్డాడు. ఇంత‌లోనే మ‌హేష్ సోద‌రుడు ర‌మేష్ బాబు హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డం వ‌ల్ల‌ కూడా స‌ర్కారు వారి షూటింగ్ పునఃప్రారంభంలో ఆల‌స్యం జ‌రిగింది. ఐతే ఎట్ట‌కేల‌కు చిత్ర బృందం మ‌ళ్లీ ప‌ని మొదలు పెడుతోంది. స‌ర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ ఆదివార‌మే ఆరంభం కానున్న‌ట్లు స‌మాచారం.

ఐతే కొత్త షెడ్యూల్లో మ‌హేష్ వెంట‌నే పాల్గొన‌డం లేదు. క‌రోనా నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ.. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని మ‌హేష్ నిర్ణ‌యించుకున్నాడు. అన్న‌య్య మ‌ర‌ణం తాలూకు బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి కూడా అత‌డికి కొంచెం స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. ఈ లోపు మిగ‌తా న‌టీన‌టుల‌తో మ‌హేష్  అవ‌స‌రం లేని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నుంది టీం. మ‌హేష్ వ‌చ్చేట‌ప్ప‌టికీ ఈ స‌న్నివేశాల‌న్నీ పూర్త‌యిపోతాయి. త‌ర్వాత అటు ఇటుగా నెల రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంద‌ట‌.

ఇంకే ర‌క‌మైన స‌మ‌స్య‌లూ లేకుంటే మార్చి మ‌ధ్య‌క‌ల్లా టాకీ పార్ట్ అంతా అయిపోతుంద‌ని స‌మాచారం. ప‌రిస్థితులు అనుకూలిస్తే ముందు అన్న‌ట్లు ఏప్రిల్ 1నే స‌ర్కారు వారి పాట‌ను రిలీజ్ చేసే అవ‌కాశ‌ముంది. ఈ సినిమా వాయిదా ప‌డుతుంద‌న్న అంచ‌నాతో ఆ తేదీకి ఆచార్య సినిమాను షెడ్యూల్ చేసిన సంగ‌తి తెలిసిందే. స‌ర్కారు వారి పాట య‌ధావిధిగా రిలీజ‌య్యేట్లుంటే ఆచార్య‌ను ముందుకో, వెన‌క్కో జ‌ర‌ప‌డం గ్యారెంటీ.