బాల‌య్య‌.. 20 ఏళ్ల త‌ర్వాత మళ్ళీ ఆ రికార్డు!


సింగిల్ థియేటర్లో కోటి రూపాయ‌ల గ్రాస్.. ఇప్పుడు టాలీవుడ్లో టాప్ లీగ్ హీరో అనిపించుకోవాలంటే ఈ ఫీట్ త‌ప్ప‌న‌సరిగా సాధించి ఉండాలి. ప్ర‌భాస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్, జూనియ‌ర్ ఎన్టీఆర్ లాంటి ఈ త‌రం సూప‌ర్ స్టార్లంద‌రూ ఈ ఫీట్ అందుకున్న వాళ్లే. ఇప్పుడు వీళ్ల సినిమా ఏది రిలీజైనా పాజిటివ్ టాక్ అందుకుంటే హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కోటి రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ట్ కావాల్సిందే.

ముందు త‌రం సీనియ‌ర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ విక్ట‌రీ వెంక‌టేష్‌ ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఐతే బాల‌య్య ఇప్ప‌టి టాప్ స్టార్లంద‌రి కంటే చాలా ముందే ఈ ఫీట్ సాధించ‌డం విశేషం. 2001లో విడుద‌లైన ఆయ‌న ఇండ‌స్ట్రీ హిట్ మూవీ న‌ర‌సింహ‌నాయుడు.. 20 ఏళ్ల ముందే సింగిల్ థియేట‌ర్లో (క్రాస్ రోడ్స్‌)లో కోటి రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి ఔరా అనిపించింది.

ఐతే ఆ త‌ర్వాత బాల‌య్య కెరీర్‌లో ఒడుదొడుకుల సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ లాంటి సినిమాల‌తో ఘ‌న‌ విజ‌యాలందుకున్న‌ప్ప‌టికీ.. అవి సింగిల్ థియేట‌ర్లో కోటి గ్రాస్ మార్కును అందుకోలేక‌పోయాయి. కానీ ఇప్పుడు అఖండ మూవీతో ఈ ఫీట్‌ను రిపీట్ చేశాడు బాల‌య్య‌. ఈ చిత్రం 100కు పైగా సెంట‌ర్ల‌లో అర్ధ‌శ‌త దినోత్స‌వం పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అందులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్ కూడా ఒక‌టి.

ఇక్క‌డ కోటి రూపాయ‌ల గ్రాస్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో అఖండ కూడా చేరింది. తొలి వారంలోనే ఇక్క‌డ 70 ల‌క్ష‌ల దాకా గ్రాస్ క‌లెక్ట్ చేసిన అఖండ‌.. ఆ త‌ర్వాత వీకెండ్స్‌లో స‌త్తా చాటుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఎట్ట‌కేల‌కు వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకుని బాల‌య్య కెరీర్లో ఈ ఘ‌న‌త సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఇలా ఓ సీనియ‌ర్ హీరో రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఈ ఫీట్ సాధించ‌డం విశేష‌మే.