పాపం.. ఇలాంటి టైంలో దించాల్సొస్తోంది


కొత్త సినిమాల కబుర్లన్నీ ఆగిపోయి.. వరుసగా వాయిదా వార్తలే వినిపిస్తున్న టైంలో ఇప్పుడో సినిమా విడుదల గురించి ప్రకటన వచ్చింది. ఆ సినిమానే.. గుడ్ లక్ సఖి. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఆది పినిశెట్టి, జగపతిబాబు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా దాదాపు ఏడాది కిందటే విడుదల కావాల్సింది. కరోనా, ఇతర కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

జనాలంతా ‘గుడ్ లక్ సఖి’ గురించి పూర్తిగా మరిచిపోయిన టైంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత దీనికి రిలీజ్ డేట్ ఇచ్చి.. రెండు మూడుసార్లు డేట్లు మార్చాల్సి వచ్చింది. చివరికి ఇప్పుడు జనవరి 28 అంటూ కొత్త డేట్ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాల విడుదలకు పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. అయినా సరే.. ఈ చిత్రాన్ని ఇలాంటి టైంలో దించాల్సి రావడం చిత్ర బృందానికి ఇబ్బందికరమే.

ఏపీలో థియేటర్ల ఆక్యుపెన్సీ 50 శాతానికి తగ్గించేశారు. నైట్ కర్ఫ్యూల వల్ల చాలా చోట్ల సెకండ్ షోలు కూడా రద్దయ్యాయి. ఐతే ‘గుడ్ లక్ సఖి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఆక్యుపెన్సీతో పెద్ద ఇబ్బందేమీ లేదు. దానికేమీ 100 శాతం ఆక్యుపెన్సీ ఉంటే మొత్తం థియేటర్లు నిండిపోవు. సగం నిండిగా గొప్పే. ఐతే ప్రస్తుతం జనాలు సినిమాలు చూసే మూడ్‌లో అయితే ఉన్నట్లు లేరు. కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఆసుపత్రుల్లో చేరాల్సినంత తీవ్రత అయితే లేదు కానీ.. కేసులు విపరీతంగా వస్తున్నాయి. ఇంకో వారానికి కరోనా కేసు లేని కుటుంబాలు అరుదైపోయే పరిస్థితి కనిపిస్తే ఆశ్చర్యపోయేలా ఉన్నాం.

ఇలాంటి టైంలో ‘గుడ్ లక్ సఖి’ని రిలీజ్ చేయాల్సి రావడం దురదృష్టకరమే. కానీ ఈ చిన్న సినిమాకు పరిస్థితులు కలిసి రాలేదు. మధ్యలో ఆర్చరీ నేపథ్యంలోనే తెరకెక్కిన ‘లక్ష్య’ రిలీజవ్వడం వల్ల కూడా ఈ సినిమాకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో రానున్న ‘గుడ్ లక్ సఖి’ ఏమంత ‘గుడ్’ జరుగుతుందో చూడాలి.