నాగార్జునపై ఇప్పుడున్నది చాలదని..

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన జనాలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మామూలు ఆగ్రహం లేదు. నిజానికి జనాల్లో కూడా జగన్ సర్కారు మీద చాలానే వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకు కారణాలు అనేకం. సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. అసలే కరోనాతో అల్లాడిపోతున్న పరిశ్రమకు నెత్తిన పిడుగులా మారింది ఏపీలో టికెట్ల ధరల వ్యవహారం. ఉన్న రేట్లే తక్కువ అనుకుంటుంటే వాటిని ఇంకా తగ్గించేసి ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టారంటూ సినీ జనాలు ఏపీ సర్కారు మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

కాకపోతే తమ అసంతృప్తిని బయట పెట్టే సాహసం చాలామంది చేయలేకపోతున్నారు. అలా బయటపెట్టిన వాళ్లను ఎలా టార్గెట్ చేస్తున్నారో.. సమస్యను ఇంకా ఎలా జఠిలం చేస్తున్నారో కూడా తెలిసిందే. ఐతే ఇలాంటి సమయాల్లో ఇండస్ట్రీ తరఫున మాట్లాడకపోయినా, సమస్య గురించి ప్రస్తావించకపోయినా పర్లేదు కానీ.. తన సినిమాకు ఏపీలో టికెట్ల రేట్లతో సమస్యే లేదని నాగార్జున ఇటీవల మాట్లాడటం అందరినీ విస్మయానికి గురి చేసింది.

సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడనంటూ ఆయన చేసిన కామెంట్ కూడా విమర్శల పాలైంది.నాగ్ ఈ కామెంట్లు చేసినప్పటి నుంచి ఆయన మీద తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది సోషల్ మీడియాలో. ముందు నుంచి జగన్‌కు నాగ్ క్లోజ్ ఫ్రెండ్ అని, ఇద్దరికీ వ్యాపార లావాదేవీలున్నాయన్న అన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే ఏపీ ప్రభుత్వం వల్ల ఇండస్ట్రీకి తలెత్తిన సమస్య గురించి నాగ్ మాట్లాడట్లేదన్న అభిప్రాయం ఉంది. ఈ విషయంలో ఆయన్ని స్వార్థపరుడిగా చూస్తున్నారు. నాగ్ స్పందనకు తగ్గట్లే.. థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గింపు, నైట్ కర్ఫ్యూను వాయిదా వేయించి ‘బంగార్రాజు’ సినిమాకు సహకారం అందించింది జగన్ సర్కారు.

దీంతో ఇటు నాగ్ మీద, అటు జగన్ సర్కారు మీద విమర్శలు ఇంకా పెరిగాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు బంగార్రాజు సక్సెస్ మీట్‌ను రాజమండ్రిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ.. దానికి ఏపీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు.. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను ముఖ్య అతిథులుగా పిలిచాడు నాగ్. దీన్నొక పెద్ద పొలిటికల్ ఈవెంట్ లాగా మార్చేశారాయన. ఓవైపు ఏపీలో పండుగ తర్వాత కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఈ వేడుకను ఇలా ప్లాన్ చేయడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. అలాగే నాగ్-వైసీపీ నాయకుల అనుబంధం సైతం చర్చనీయాంశం అవుతోంది. ఈ పరిణామాలతో నాగ్ మరింతగా సోషల్ మీడియాకు టార్గెట్ అవుతున్నారు.