మరో బిగ్ సినిమా వాయిదా

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తుండ‌టం.. కేసులు రోజు రోజుకూ పెరిగిపోతుండ‌టంతో వేగంగా ప‌రిస్థితులు మారిపోతున్నాయి. ఒక్కో రాష్ట్రం ఆంక్ష‌ల దిశ‌గా అడుగులు వేస్తోంది. నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డితే ముందుగా ప్ర‌భావితం అయ్యేది థియేట‌ర్లే అన్న‌ది తెలిసిందే. ఇప్ప‌టికే ఢిల్లీలో థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీని 50 శాతానికి త‌గ్గించారు.

నైట్ క‌ర్ఫ్యూల వ‌ల్ల సెకండ్ షోలు ర‌ద్ద‌య్యాయి. మంగ‌ళ‌వారం రెండు పెద్ద రాష్ట్రాల్లో థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ఉత్త‌రాదిన బీహార్లో థియేట‌ర్ల‌ను మూసి వేస్తున్న‌ట్లు ముందుగా ప్ర‌క‌ట‌న రాగా.. కొన్ని గంట‌ల్లోనే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా ఇదే బాట ప‌ట్టింది. రాష్ట్రంలో థియేట‌ర్ల‌న్నింటినీ మూసివేయాల‌ని నిర్ణ‌యించింది. దీంతో అక్క‌డి ప్రేక్ష‌కుల్లో ఎన్నో ఆశ‌ల‌తో ఎదురు చూస్తున్న భారీ చిత్రం వ‌లిమైని వాయిదా వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి త‌లెత్తింది.

ఇంకా చిత్ర బృందం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు కానీ.. వ‌లిమై వాయిదా ప‌డ‌టం లాంఛ‌న‌మే అని తేలిపోయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. త‌మిళంతో పాటు వివిధ భాష‌ల్లో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేశారు. ఇదే పేరుతో తెలుగులో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్ కూడా వ‌దిలారు. కానీ కొన్ని గంట‌ల్లోనే వేగంగా ప‌రిస్థితులు మారిపోయాయి.

క‌రోనా కేసుల సంఖ్య ఒక్క‌సారిగా పెరిగిపోతుండ‌టంతో వ‌లిమై లాంటి భారీ చిత్రం సంక్రాంతికి రిలీజైతే వైర‌స్ ఉద్ధృతి మ‌రో స్థాయికి చేర‌డం ఖాయం. అందుకే ముందే థియేట‌ర్ల‌ను మూయించి ఆ చిత్ర బృందానికి ఒక క్లారిటీ ఇచ్చేసిన‌ట్లు అయింది. ఇలా చేయ‌కుంటే రిలీజ్‌కు ఏర్పాట్లు జ‌రిగిపోతాయి. చివ‌రి నిమిషంలో రిలీజ్ వాయిదా వేయాల్సి వ‌స్తే అంత‌టా గంద‌ర‌గోళం నెల‌కొంటుంది. అందుకే ముందే క్లారిటీ ఇచ్చేశారు. చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు త‌ప్పేలా లేవు. ఇక్క‌డా సంక్రాంతి సినిమాల‌కు పంచ్ ప‌డేలా ఉంది.