పాన్ ఇండియా రిలీజ్.. సుక్కు నవ్వుకున్నాడట


బాహుబలి తర్వాత పాన్ ఇండియా రిలీజ్ అనేది ఒక ప్రహసనం లాగా మారిపోయింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న తరహాలో సౌత్ నుంచి చాలామంది ‘పాన్ ఇండియా’ బాట పట్టేశారు. ఐతే పేరుకు పాన్ ఇండియా సినిమానే కానీ.. సినిమా ఒక భాషలో తీసి వేరే భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడమే జరుగుతోంది. ఇలా రిలీజైన సినిమాలు ప్రాంతీయ భాషల్లో మినహా ప్రభావం చూపిన దాఖలాలు కూడా తక్కువే. సాహో, కేజీఎఫ్ మినహాయిస్తే అనుకున్నంత ప్రభావం చూపిన సినిమాలు దాదాపు లేవనే చెప్పాలి.

‘పుష్ప’ కూడా ఇదే బాట పడుతుందేమో అన్న సందేహాలు విడుదలకు ముందు కలిగిన మాట వాస్తవం. అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్‌లో, టీవీ ఛానెళ్లలో బాగా ఆడేసినంత మాత్రాన ‘పుష్ప’ సినిమా థియేటర్లలో ప్రభావం చూపుతుందా.. తమిళనాడులో ఈ సినిమాను అన్న డౌట్లు వచ్చాయి చాలామందికి. కానీ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల అవతల అంచనాల్ని మించి ఆడేస్తోంది.

నిజానికి ‘పుష్ప’ రిలీజ్‌కు ముందు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపుతుందని దర్శకుడు సుకుమార్‌కు కూడా అస్సలు నమ్మకం లేదట. దీన్ని తాను కేవలం తెలుగు సినిమాగా మాత్రమే చూశానని.. తెలుగు రిలీజ్ మీదే దృష్టిపెట్టానని, ఎప్పుడూ పాన్ ఇండియా సినిమా అనే భావన తనకు కలగలేదని సుకుమార్ నిజాయితీగా చెప్పాడు. హీరో బన్నీ, నిర్మాతలు కలిసి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో రిలీజ్ చేయాలని పట్టుబట్టారని.. ఐతే అల్లు అర్జున్‌కు కేరళలో ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడ మాత్రమే ఈ సినిమా ఆడుతుందని తాను అనుకున్నానని చెప్పాడు సుకుమార్.

రిలీజ్ ముంగిట నేపాల్‌కు ప్రింట్లు వెళ్లాయా అంటుంటే.. నేపాల్‌కు ప్రింట్లేట్రా అంటూ తాను నవ్వుకున్నానని.. యూపీ, బీహార్ రిలీజ్ గురించి మాట్లాడుతుంటే వీళ్ల పిచ్చి కాకపోతే అక్కడ ఈ సినిమా ఏం ఆడుతుంది అనుకున్నానని సుక్కువ వెల్లడించాడు. ఐతే ఇప్పుడు ఈ సినిమా వేరే రాష్ట్రాల్లో ఆడుతున్న తీరు చూసి తనకెంతో ఆశ్చర్యంగా ఉందని, బన్నీని తాను తక్కువ అంచనా వేశానని అర్థమైందని చెప్పాడు. తొలి రోజుతో సమానంగా ఇప్పుడు వసూళ్లు వస్తున్నాయని, ఆదివారం కంటే సోమవారం వసూళ్లు ఎక్కువొచ్చాయని.. ఇదంతా తనకు నమ్మశక్యంగా లేదని, ఒకసారి ముంబయికి వెళ్లి అక్కడి జనాలతో కలిసి సినిమా చూసి అసలు ఈ సినిమాలో వాళ్లకేం నచ్చిందో అనలైజ్ చేయాలనుకుంటున్నానని సుకుమార్ చెప్పడం విశేషం.