బండ్ల గణేష్ పై అరెస్ట్ వారెంట్!

Bandla Ganesh

టాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒంగోలు ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరులు అనే వ్యక్తికి బండ్ల గణేష్ రూ.1 కోటి 25 లక్షల చెక్ ను ఇచ్చారట. ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో.. వెంటనే జెట్టి వెంకటేశ్వరులు కోర్టుని ఆశ్రయించారు. 

విచారణకు హాజరు కావాలంటూ బండ్ల గణేష్ కి పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఆయన మాత్రం స్పందించలేదట. దీంతో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు జడ్జి బండ్ల గణేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం బండ్ల గణేష్ కి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి కేసులోనే పోలీసులు బండ్ల గణేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 

గతంలో కడప జిల్లాకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర కోటి ముప్పై లక్షలు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో మహేష్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టులో విచారణకు హాజరు కావాలని చెప్పినా.. బండ్ల గణేష్ వినకపోవడంతో క‌డ‌ప‌జిల్లా మెజిస్ట్రేట్ బండ్ల గ‌ణేష్‌పై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడు మరోసారి బండ్ల గణేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 

ఇక సినిమాల విషయానికొస్తే.. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో ‘డేగల బాబ్జీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.