ఆర్‌ఆర్‌ఆర్‌‌.. దేన్నీ వదలట్లేదుగా!

సినిమా తీయడంలోనే కాదు.. ఆ సినిమాను ప్రమోట్ చేయడంలో కూడా రాజమౌళిని కొట్టేవాడే లేడు. ‘ఆర్‌ఆర్ఆర్‌‌’ ప్రమోషన్స్ విషయంలో జక్కన్న ప్లానింగ్‌ పర్‌‌ఫెక్ట్‌గా ఉంది. సంక్రాంతికి రాధేశ్యామ్ కూడా రాబోతోంది. కానీ ఆ టీమ్ ఇంతవరకు జనాల ముందుకే రాలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ మాత్రం ఆల్మోస్ట్ దేశమంతా చుట్టేసింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న విధానానికి హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి.       

ఇప్పటికే ముంబైలో ప్రెస్‌మీట్లు పెట్టారు. ట్రైలర్ లాంచ్‌లు, స్పెషల్ ఈవెంట్లు అంటూ మీడియాకి, జనానికి ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోని గెస్ట్‌గా తీసుకొచ్చి ఒక్కసారిగా తమ సినిమా రేంజ్‌ని డబుల్ చేసేశారు. ఇప్పుడు కపిల్‌శర్మ షోకి కూడా వెళ్లడానికి రెడీ అయ్యారు.       

కపిల్‌ శర్మ స్టాండప్‌ కమెడియన్. తన షో చాలా ఫేమస్. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్‌ని సైతం తన కామెడీతో వెనక్కి నెట్టేసిన ఘనత కపిల్‌ది. తన షోకి వచ్చినంత టీఆర్పీ మరి దేనికీ రాదనేది వాస్తవం. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత గొప్ప స్టార్ అయినా ఆ షోకి వెళ్లి ప్రమోట్ చేసుకోవాల్సిందే. అందుకే దానిపై కూడా కన్నేసింది జక్కన్న టీమ్.       

తారక్, చరణ్, ఆలియా, రాజమౌళి కలిసి కపిల్‌ షోకి వెళ్లనున్నారు. నలుగురూ ఉన్న ఫొటోని నెట్‌లో పోస్ట్ చేసి.. ‘మా టీమ్‌ మనసారా నవ్వడానికి కపిల్‌శర్మ షోకి వెళ్లబోతోంది’ అని చెప్పారు. కపిల్‌కి మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లంతా క్రమం తప్పకుండా షోని చూస్తారు. కాబట్టి ఆ షోకి వెళ్లడమనేది కరెక్ట్ ఆలోచన. మొత్తానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌‌’ని ప్రమోట్ చేయడానికి దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ రాజమౌళి వదలడం లేదనేది ఈ దెబ్బతో ప్రూవ్ అయ్యింది.