బాల‌య్యను ఓ రేంజిలో లేపుతున్నారే..

Balayya-CDP

ఇంకో ఐదు రోజుల్లో నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు. అందుకు ఐదు రోజుల ముందే సోష‌ల్ మీడియాలో హంగామా మొద‌లైపోయింది. స్టార్ హీరోల పుట్టిన రోజులొస్తుంటే.. ముందే స్పెష‌ల్‌గా కామ‌న్ డిస్ ప్లే పిక్ రెడీ చేయించి.. సెల‌బ్రెటీల‌తో దాన్ని లాంచ్ చేయించ‌డం ఇప్పుడు ఫ్యాష‌న్‌గా మారింది.

ఇదే కోవ‌లో బాల‌య్య అభిమానుల కోసం ఓ సీడీపీ త‌యారు చేయించారు. ఆదిత్య 369లో శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు లుక్‌తో పాటు నిప్పుర‌వ్వ‌లో లుక్ తీసుక‌ని జై బాల‌య్య నినాదాలు, బాల‌య్య త‌ల్లిదండ్రుల ఫొటోల‌తో క‌లిపి ఈ సీడీపీ త‌యారు చేయించారు. ఈ సీడీపీని ఏకంగా 50 మంది ప్ర‌ముఖుల‌తో లాంచ్ చేయించ‌డం విశేషం. అందులో బాల‌య్య త‌న‌యురాలు బ్రాహ్మ‌ణితో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, పీఆర్వోలు ఉన్నారు.

గ‌త నెల‌లో ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 25 మంది సెల‌బ్రెటీల‌తో సీడీపీ లాంచ్ చేయించారు. బాల‌య్య విష‌యానికి వ‌చ్చేస‌రికి సంఖ్య రెట్టింప‌వ‌డం విశేషం. ఇటీవ‌ల చిరు అండ్ కోతో బాల‌య్య అనుకోని త‌గ‌వు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం విష‌యంలో సినీ ప‌రిశ్ర‌మ రెండుగా చీలిన‌ట్లు క‌నిపించింది.

కానీ ఇప్పుడు చిరు వ‌ర్గం అనుకున్న చాలామంది బాల‌య్య గురించి ఓ రేంజిలో ఎలివేష‌న్లు ఇస్తూ ఆయ‌న బ‌ర్త్ డే సీడీపీతో ట్వీట్లు వేయ‌డం విశేషం. ఆ ట్వీట్లు.. అవి వేసిన వ్య‌క్తుల్ని చూస్తే వీళ్లు బాల‌య్యను ఈ రేంజిలో లేపుతున్నారేంటి అన్న అనుమానం క‌లుగుతుంది.

చిరు, బాల‌య్య మధ్య అనుకోకుండా వ‌చ్చిన గ్యాప్‌ను ఫిల్ చేసి ఇండ‌స్ట్రీ అంతా ఒక‌టే అని చూపించేందుకే ఈ ప్ర‌య‌త్నమా అన్న సందేహాలు కూడా త‌లెత్తుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే బాల‌య్య పుట్టిన రోజుకు ఇంకెంత హంగామా ఉంటుందో చూడాలి మ‌రి.