యంగ్ హీరో.. నాలుగు పడవల ప్రయాణం

హీరోయిన్లు ఒకేసారి రెండు… మూడు.. నాలుగు.. ఇలా ఎక్కువ సినిమాల్లో నటించొచ్చు కానీ.. హీరోలకు ఆ వెసులుబాటు ఉండదు. చాలా వరకు సినిమాలు హీరోల చుట్టూనే తిరుగుతాయి కాబట్టి ఒక్కో చిత్రానికి బల్క్ డేట్లు ఇవ్వాలి. ఒక లుక్ మెయింటైన్ చేయాలి. ఇంకా చాలా రకాల విషయాలు ముడిపడి ఉంటాయి. అందుకే ఒక టైంలో ఒక సినిమాకే సమయం ఇస్తుంటారు. మహా అయితే ఇంకొక్క సినిమాను జోడిస్తారు. కానీ ఒక హీరో ఒకే టైంలో నాలుగు సినిమాల్లో నటించాలంటే మాత్రం కష్టమే.

యువ కథానాయకుడు నిఖిల్ ఇప్పుడు ఈ సాహసమే చేస్తున్నాడు. ఆల్రెడీ అతను ‘18 పేజెస్’, ‘కార్తికేయ-2’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాలూ చివరి దశలో ఉన్నాయి. ఇంతలోనే గత కొన్ని వారాల్లో నిఖిల్ రెండు కొత్త చిత్రాలను అనౌన్స్ చేశాడు.

అందులో ఒకటి ఎడిటర్ గ్యారీ డైరెక్టర్‌గా మారి తీయబోతున్న స్పై థ్రిల్లర్ కాగా.. ఇంకోటి తాజాగా ప్రకటించిన సుధీర్ వర్మ చిత్రం. ఈ నాలుగు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఏక కాలంలో చేస్తుండటంతో ఇది తనకు చాలా కొత్త అనుభవం అంటూ నిఖిల్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పటిదాకా కెరీర్లో చాలా వరకు ఒకసారి ఒక సినిమా మాత్రమే చేస్తూ వచ్చానని.. కానీ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఏక కాలంలో నాలుగు సినిమాలు చేస్తున్నానని.. ఈ నాలుగు చిత్రాలూ తనకెంతో ఇష్టమైన స్క్రిప్టులతో తెరకెక్కుతున్నవని.. అందుకే అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నానని నిఖిల్ వెల్లడించాడు.

సుకుమార్ కథతో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ చేస్తున్న ‘18 పేజెస్’ వీటిలో అన్నింటికంటే ముందు రిలీజయ్యే అవకాశముంది. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఇక ఒకప్పుడు నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా అతడి కెరీర్లోనే అత్యధి బడ్జెట్లో రూపొందుతోంది. వీటితో పాటు గ్యారీ, సుధీర్ వర్మ సినిమాలు కూడా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘కార్తికేయ-2’తో పాటు ఇవి రెండూ కూడా థ్రిల్లర్లే కావడం విశేషం.