‘త్రీ రోజెస్‌’లో తెలుగు గులాబీ

ఓటీటీలు వచ్చాక సినిమాలతో వెబ్ సిరీసులు పోటీ పడుతున్నాయి. పాపులర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఫేమస్ ఫిల్మ్ మేకర్స్ ఇన్‌వాల్వ్ అవుతున్నారు. కంటెంట్‌తో పాటు బడ్జెట్ విషయంలోనూ రాజీ పడటం లేదు. అందుకే వాటికి ఆదరణ కూడా ఆ స్థాయిలోనే ఉంటోంది. టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌‌ మారుతి డిజిటల్‌ వరల్డ్ వైపు అడుగులు వేయడానికి కారణం అదే.

తెలుగు ఓటీటీ ఆహా కోసం ‘త్రీ రోజెస్‌’ అనే వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. రవి నంబూరి కథ అందించిన ఈ సిరీస్‌కి మారుతి షో రన్నర్‌‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాగీ డైరెక్ట్ చేస్తున్నాడు. ముగ్గురమ్మాయిలు లీడ్ రోల్స్‌ చేస్తున్నారు. వారిలో ఒకరు ఈషా రెబ్బా. తన లుక్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఆమె పాత్ర పేరు రీతూ. తన క్యారెక్టర్‌‌లో టూ షేడ్స్ ఉంటాయని పోస్టర్‌‌ చూస్తే అర్థమవుతోంది. ఒక లుక్‌లో చీరకట్టుతో సంప్రదాయబద్దంగా ఉన్న ఈషా, మరో లుక్‌లో మోడర్న్ డ్రెస్‌ వేసి మతులు పోగొడుతోంది.

త్వరలో మిగతా ఇద్దరమ్మాయిల లుక్స్ కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈ సిరీస్‌లో నటిస్తున్నట్టు చాలాకాలం క్రితమే పాయల్ రాజ్‌పుత్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మరి తను యాక్ట్ చేసిందా లేక తన ప్లేస్‌లోకి ఎవరైనా వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. మూడో అమ్మాయి అదాశర్మ అనే టాక్ వినిపిస్తోంది. ఆ విషయంలో కూడా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈషా విషయంలో క్లారిటీ వచ్చింది.

చాలా సినిమాలే చేసినా సరైన నేమ్, ఫేమ్ రాక ఇబ్బంది పడుతోంది ఈషా. అందంగా ఉంటుంది. బాగానే పర్‌‌ఫార్మ్ చేస్తుంది. అయినా రేస్‌లో ఎప్పుడూ వెనకే ఉంటోంది. ఆల్రెడీ ‘పిట్టకథలు’ సిరీస్‌లో నటించినా ఆమెకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. కానీ ‘త్రీ రోజెస్’ మారుతి నేతృత్వంలో తెరకెక్కుతోంది కాబట్టి, అతని ప్రాజెక్టులకు మినిమమ్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి.. ఈ సిరీస్‌తో డిజిటల్ ప్రపంచంలో అయినా ఈషా సక్సెస్ అవుతుందేమో చూడాలి.