‘బ్యాచిలర్’కు మధ్యలో చేసిన మార్పేంటి?


అక్కినేని కుర్రాడు అఖిల్‌కు కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఎన్నో అంచనాల మధ్య చేసిన తొలి సినిమా ‘అఖిల్’.. ఆ తర్వాత నటించిన హలో, మిస్టర్ మజ్ను డిజాస్టర్లవడంతో అఖిల్ కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఈ స్థితిలో అఖిల్ కెరీర్‌ను చక్కదిద్దడానికి అల్లు అరవింద్ ముందుకు వచ్చారు. గతంలో నాగచైతన్యకు పెద్ద హిట్ లేక ఇబ్బంది పడుతున్న టైంలో గీతా ఆర్ట్స్‌లో చేసిన ‘100 పర్సంట్ లవ్’ అతడి కరవును తీర్చింది.

ఇప్పుడు అఖిల్‌ను కూడా అలాగే తన చేతుల్లోకి తీసుకున్నాడు అరవింద్. మామూలుగానే అరవింద్ సినిమాల ఎంపిక, వాటి మేకింగ్ చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇక అఖిల్ కెరీర్ దృష్టితో చూస్తే ఈ సినిమాపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటాడనడంలో సందేహం లేదు. ఐతే ఇంత కీలకమైన సినిమాకు కేవలం 45 నిమిషాల సిట్టింగ్‌తో అరవింద్ స్క్రిప్టును ఓకే చేసేశారట. ఈ విషయాన్ని చాలా ఆశ్చర్యంతో చెప్పుకొచ్చాడు నిర్మాత బన్నీ వాసు.

ఐతే ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూటింగ్ 50 శాతం పూర్తయిన తర్వాత భాస్కర్ ద్వితీయార్ధంలో స్క్రిప్టును మార్చేద్దామని అన్నాడట. ఐతే బన్నీ వాసు అందుకు ఒప్పుకోలేదట. అఖిల్‌తో ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ తీయాలన్నది తన ఉద్దేశమని.. ముందు అనుకున్న కథ ఆ తరహాలోనే ఉందని.. అలా ఉంటేనే బాగుంటుందని పట్టుబట్టాడట. ఐతే తర్వాత ఆలోచిస్తే భాస్కర్ చెప్పిన ఐడియా కొత్తగా ఉందనిపించి.. ఆ విషయాన్ని అరవింద్‌కు చెబితే ఆయన మళ్లీ స్క్రిప్టు పూర్తిగా నరేట్ చేయమని అడిగారని.. కథ పూర్తిగా మళ్లీ చెబితే భాస్కర్ చెప్పిన ఐడియా కొత్తగా ఉందని.. దాని మీదే వర్క్ చేసి అతననుకున్నట్లుగానే సినిమా తీయమని చెప్పారని బన్నీ వాసు వెల్లడించాడు.

భాస్కర్ చెప్పిన కొత్త ఐడియా వల్ల సినిమా స్వరూపమే మారిపోయిందని.. ముందు ఫస్టాఫ్‌ను చాలా ఇష్టపడ్డ తనకు ఇప్పుడు సెకండాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ చాలా నచ్చుతోందని.. రేప్పొద్దున ప్రేక్షకులకు కూడా ఆ పాయింట్ బాగా నచ్చుతుందని అన్నాడు వాసు. మొత్తానికి వాసు మాటల్ని బట్టి చూస్తుంటే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సెకండాఫ్‌లో ఏదో ఒక సంచలన పాయింట్ ఉందేమో అనిపిస్తోంది. అదేంటో చూడాలి మరి.