కాంట్రవర్శీ.. కాస్త ముందుగానే!

సంజయ్ లీలా భన్సాలీ అనగానే అతడు తీసిన భారీ చిత్రాలే కాదు.. కాంట్రవర్శీలు కూడా గుర్తొస్తాయి. రామ్‌లీల, పద్మావత్‌, గంగూబాయ్ కథియావాడి లాంటి చిత్రాలన్నీ కంటెంట్ పరంగా వివాదాల్లో చిక్కుకున్నవే. కొన్ని కట్స్‌కి గురై బయటపడితే, కొన్ని మాత్రం సేఫ్‌గా గొడవ నుంచి సైడయ్యాయి. అయితే ఈసారి కాస్త ముందే, అంటే ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే కాంట్రవర్శీకి తెర తీశాడు సంజయ్.

‘హీరామండీ’.. లాహోర్‌‌లోని ఓ ప్లేస్. ముఘల్‌ రాజులు తమకు నచ్చిన మహిళల్ని తెచ్చి ఇక్కడ బంధించేవారు. అక్కడే ఎంజాయ్ చేసేవారు. అది కాస్తా తర్వాతి కాలంలో వేశ్యావాటికగా మారిపోయింది. అలాంటి ప్రదేశం గురించి, అదే పేరుతో సినిమా తీయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు భన్సాలీ. వర్కవుట్ కాకపోవడంతో వెబ్‌ సిరీస్‌కి ప్లాన్ చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం భారీ స్థాయిలో దీన్ని తీయబోతున్నట్టు ఈ మధ్యనే అనౌన్స్ చేశాడు. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనె, మాధురీ దీక్షిత్, ఆలియా భట్, సోనాక్షీ సిన్హా, పరిణీతి చోప్రా లాంటి పదిమంది ఫేమస్ బ్యూటీస్ ఇందులో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సిరీస్‌ తీయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటివి తీయడం వల్ల పాకిస్థాన్‌తో పంగా పెట్టుకున్నట్టు అవుతుందంటున్నారు. రీసెంట్‌గా పాకిస్థానీ నటి ఉష్ణా షా కూడా రియాక్టయ్యింది. ‘హీరమండీ లాహోర్‌‌లో ఉంది. లాహోర్ పాకిస్థాన్‌లో ఉంది. ముఘల్‌ చరిత్రతో పాటు, పాకిస్థాన్‌ హిస్టరీలోనూ దానికో ప్రాధాన్యత ఉంది. దాని గురించి ఏం తెలుసని సిరీస్ తీస్తారు? భన్సాలీ ఈ సిరీస్ తీయడమంటే, మహాభారతం మీద పాకిస్థానీ డైరెక్టర్‌‌ సినిమా తీసినట్టే ఉంటుంది’ అందామె.

కొందరు ఉష్ణ మాటల్ని సమర్థిస్తుంటే, కొందరు మాత్రం కావాలని ఇష్యూ చేస్తున్నారని అంటున్నారు. ఎవరు ఏ సబ్జెక్ట్ మీదయినా సినిమా తీయొచ్చు, అందులోనూ భన్సాలీ లాంటి వాడు తీస్తే చరిత్రలో మరుగున పడిపోయిన ఎన్నో విషయాలు బైటికొస్తాయి అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు ఏమన్నా భన్సాలీ అయితే మొండివాడు. ఇక నెట్‌ఫ్లిక్స్‌ కూడా వెనక్కి తగ్గే టైప్ కాదు. కాబట్టి ఈ సిరీస్‌ వచ్చి తీరడం ఖాయమనేది ఎక్కువమంది అంటున్న మాట.