‘సర్కారు వారి పాట’ ఎక్కడిదాకా వచ్చింది?

తెలుగు ప్రేక్షకుల్లో అత్యధిక అంచనాలున్న భారీ చిత్రాల్లో ‘సర్కారు వారి పాట’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇప్పటిదాకా మీడియం రేంజ్ సినిమాలకే పరిమితం అయిన పరశురామ్.. తొలిసారి ఓ పెద్ద స్టార్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ లాంటి పెద్ద సంస్థలు కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఇంకా చాలా ప్రత్యేకతలే ఉన్నాయీ సినిమాకు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా గత నెలలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం అయితే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలి. సినిమా మొదలైనపుడే సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారు. ఐతే మధ్యలో కరోనా సెకండ్ వేవ్ వల్ల రెండు నెలలకు పైగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి రిలీజ్ ఖాయమేనా అన్న సందేహాలు కలిగాయి.

కానీ టీజర్ లాంచ్ సందర్భంగా సంక్రాంతి విడుదల పక్కా అని నొక్కి వక్కాణించారు. మరి షూటింగ్ ఎంత దాకా వచ్చింది, ఔట్ పుట్ ఎంత సంతృప్తికరంగా ఉంది అనే విషయాల్లో ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు. ఈ విషయమై మహేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా చిత్రీకరణ 60 నుంచి 70 శాతం వరకు పూర్తయిందని అతను వెల్లడించాడు. ఇప్పటిదాకా వచ్చిన రషెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని.. అభిమానులు ఈ సినిమాలో కొత్త మహేష్‌ను చూస్తారని సూపర్ స్టార్ అన్నాడు.

ఈ చిత్రాన్ని ఒకే సిట్టింగ్‌లో, తక్కువ సమయంలో తాను అంగీకరించానని.. తన కెరీర్లో ఇది మరో ‘పోకిరి’ అవుతుందని మహేష్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక రాజమౌళితో తాను చేయాల్సిన సినిమా గురించి మహేష్ మాట్లాడుతూ.. ఆయనతో సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నానని.. తన కల నెరవేరుతున్నట్లు అనిపిస్తోందని.. ఈ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడ్డం తొందరపాటు అవుతుందని, సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పాడు.