చైతూకు నాగ్ గిఫ్ట్ ఇస్తాడా?

టాలీవుడ్ ఇప్పుడో సమావేశం కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఆ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని తెలుగు సినీ ప్రతినిధుల బృందానికి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నెలన్నర ముందే ఈ మీటింగ్ గురించి సమాచారం బయటికి వచ్చినప్పటికీ.. అది కార్యరూపం దాల్చడానికి బాగా టైం పట్టేసింది. ఎట్టకేలకు ఈ నెల 20న చిరు బృందానికి జగన్ దగ్గర అపాయింట్మెంట్ దొరికినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం టాలీవుడ్ భవితవ్యాన్ని నిర్దేశిస్తుందని భావిస్తున్నారు.

టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నియంత్రణను ఎత్తేయడంతో పాటు.. నైట్ షోలకు అనుమతులివ్వడం.. అవసరాన్ని బట్టి అదనపు షోలు, బెనిఫిట్ షోలు వేసుకునే.. టికెట్ల రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించడం.. లాంటి వరాల కోసం టాలీవుడ్ ఎదురు చూస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఏపీలో థియేటర్లలో సానుకూల పరిస్థితులు లేక పేరున్న సినిమాలు చాలానే విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. ఏపీలో పరిస్థితులు చక్కబడ్డాకే రిలీజ్ చేద్దామని చాలా చిత్రాలను ఆపారు. ‘లవ్ స్టోరి’ కూడా అలా ఆగిన సినిమానే. ఐతే ఈ మీటింగ్ గురించి స్పష్టత రాకముందే ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేశారు. ఈ నెల 24న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇంతలో మీటింగ్ డేట్ వచ్చింది. చిరు బృందంలో అక్కినేని నాగార్జున కూడా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ బృందంలో అందరికంటే జగన్‌తో సన్నిహిత సంబంధాలున్నది నాగార్జునకే. ఇలాంటి మీటింగ్స్ బాగా డీల్ చేయగలడనీ నాగ్‌కు పేరుంది. కాబట్టి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్‌కు నాగ్ సావధానంగా వివరించి సానుకూల ఫలితం రాబడతాడని ఆశిస్తున్నారు. ఆయనది చేయగలిగితే ముందుగా లాభపడేది కొడుకు చైతూ సినిమానే. ఏపీలో టికెట్ల రేట్లు, నైట్ షోల సమస్య తీరిపోతే ‘లవ్ స్టోరి’ ఎంతగా కలిసొస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి నాగ్ ఈ మీటింగ్‌లో జాగ్రత్తగా డీల్ చేసి కొడుక్కి గిఫ్ట్ ఇస్తాడేమో చూడాలి.