చిరంజీవికి అభిమానుల ఆకాంక్షలు పట్టవా?

Chiranjeevi Fans

మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం విరామం తర్వాత నాలుగేళ్ల కిందట సినిమాల్లోకి పునరాగమనం చేశారు. రీఎంట్రీ సినిమా కోసం రెండు మూడేళ్ల పాటు కసరత్తు జరిగింది. ఏవేవో కథలు అనుకుని చివరికి తమిళ బ్లాక్‌బస్టర్ ‘కత్తి’ని రీమేక్ చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇది మెజారిటీ అభిమానులకు రుచించలేదు.

ఈ సినిమా మంచి విజయమే సాధించి ఉండొచ్చు కానీ.. చిరును ఒక ఒరిజినల్ స్టోరీతోనే మళ్లీ సినిమాల్లో చూడాలని అభిమానులు ఆశించారు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’ లాంటి ఒరిజినల్ సినిమాలు చేయడం వారికి ఆనందాన్నిచ్చింది. కానీ తర్వాత మళ్లీ ఆయన రీమేక్ చేయడానికి రెడీ అయిపోయారు. అదే.. లూసిఫర్. తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమాను చిరు రీమేక్ చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తినా ఆయన వెనక్కి తగ్గలేదు.

అది చాలదన్నట్లు ‘వేదాళం’ రీమేక్‌నూ లైన్లో పెట్టారు. పైగా దీనికి అసలేమాత్రం ఫాంలో లేని మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ సినిమా విషయంలో అభిమానుల వ్యతిరేకత మామూలుగా లేదు. ఐతే తాము వ్యతిరేకిస్తే సినిమా ఆగదని అర్థమై ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. వాస్తవాన్ని అంగీకరించి ఊరుకున్నారు.

కానీ చిరంజీవి అంతటితో ఆగకుండా మరో రీమేక్‌ను తెరపైకి తేవడం అభిమానులకు అసలేమాత్రం రుచించడం లేదు. అజిత్ మూవీ ‘ఎన్నై అరిందాల్’ రీమేక్‌లో నటించడానికి చిరు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కూడా తెలుగులోకి అనువాదం అయింది. యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇలాంటి సినిమాను ఇప్పుడు చిరు రీమేక్ చేయాల్సిన అవసరమేంటన్నది ప్రశ్న.

అమితాబ్ బచ్చన్ లాగా కాస్త భిన్నమైన కథలతో ప్రయాణం చేస్తూ తన ప్రత్యేకతను చాటుకోవాల్సిన సమయంలో చిరు ఇలా రీమేక్‌లను పట్టుకుని వేలాడ్డమేంటో అంతుబట్టడం లేదు. పైగా ఆయన ఎక్కువగా రొటీన్ మాస్ మసాలా సినిమాలకే ఓటేస్తున్నారు. అభిమానుల ఆకాంక్షలకు విరుద్ధంగా చిరు అడుగులు వేస్తున్న సంగతి స్పష్టం. ఇప్పటికే మొదలైన సినిమాల విషయంలో ఏం చేయలేం కానీ.. కనీసం ‘ఎన్నై అరిందాల్’ విషయంలో అయినా ఆయన పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.