నితిన్ అంతలోనే ఎందుకు భయపడ్డాడు?

యూత్ స్టార్ నితిన్ కొత్త చిత్రం ‘మాస్ట్రో’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి హాట్ స్టార్ ఓటీటీ ద్వారా నేరుగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్లోనే ధ్రువీకరించారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే విషయంలోనే కొంచెం సందిగ్ధత నెలకొంది. ముందు నుంచి సెప్టెంబరు 10న ప్రిమియర్స్ ఉండొచ్చని ప్రచారం సాగుతూ వచ్చింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేసిన ట్రైలర్లో చివరగా సెప్టెంబరు 9న ప్రిమియర్స్ అంటూ డేట్ ఇచ్చారు.

కానీ ఏమైందో ఏమో.. ఇంకో పది నిమిషాలకు ట్విస్ట్ ఇచ్చాడు నితిన్. ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌ను డెలీట్ చేసి.. ఆ తర్వాత ఇంకో ట్రైలర్ వదిలాడు. అందులో రిలీజ్ డేట్ ఏమీ లేదు. ‘కమింగ్ సూన్’ అని మాత్రమే పేర్కొన్నారు. హీరోయిన్ నభా నటేష్ షేర్ చేసిన ట్రైలర్ లింక్ క్లిక్ చేస్తే ఆ వీడియో తీసేసినట్లు మెసేజ్ రావడం గమనించవచ్చు. ఆమె షేర్ చేసింది నితిన్ ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలరే.

ముందు రిలీజ్ డేట్ ఇచ్చి పది నిమిషాల్లో ఆలోచన మార్చుకోవవాల్సిన ఏమొచ్చింది.. నితిన్ ఎందుకు భయపడ్డాడు అన్నది చర్చనీయాంశంగా మారింది. బహుశా ఎగ్జిబిటర్లు ఇటీవల చేసిన హెచ్చరికల కారణంగానే నితిన్ మనసు మార్చుకున్నాడా అని డౌట్ కొడుతోంది. పేరున్న సినిమాలను ఓటీటీ బాట పట్టించడంపై ఎగ్జిబిటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగానే సునీల్ నారంగ్ ఇంకో మాట కూడా అన్నారు. పండుగలప్పుడు థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలకు పోటీగా ఓటీటీల్లో సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదన్నారు. టక్ జగదీష్, మాస్ట్రో చిత్రాలు రెండూ వినాయక చవితి వీకెండ్‌నే టార్గెట్ చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం.

‘టక్ జగదీష్’ రిలీజ్ డేట్ అయితే ఇంకా ప్రకటించలేదు కానీ.. ఈ లోపు ‘మాస్ట్రో’ ప్రిమియర్ డేట్ ఇచ్చారు. ఐతే ఎగ్జిబిటర్ల ఆందోళన నేపథ్యంలో దీనిపై వివాదం మొదలవుతుందేమో అన్న డౌట్‌తో నితిన్ అండ్ టీం వెనక్కి తగ్గినట్లుంది. మరి డేట్ మార్చుకుంటారా లేక విడుదల తేదీ గురించి చర్చ జరగనివ్వకుండా సైలెంటుగా ఉండి చివర్లో డేట్ ప్రకటించి ఉన్నట్లుండి సెప్టెంబరు 9నే రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.