ర‌వితేజ‌ను న‌మ్మి అంత పెట్టేశారా?


మాస్ రాజా ర‌వితేజ టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్ల‌లో ఒక‌డు. అత‌డి సినిమాల‌కు ప్ర‌స్తుతం రూ.50 కోట్ల‌కు పైగానే బిజినెస్ జ‌రుగుతోంది. మాస్ రాజా సినిమాల మీద రూ.30-35 కోట్ల మ‌ధ్య బ‌డ్జెట్ పెడితే నిర్మాత‌లు మంచి లాభాలే అందుకునే అవ‌కాశం ఉంది. మ‌ధ్య‌లో వ‌రుస‌గా డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ చివ‌ర‌గా ర‌వితేజ నుంచి వ‌చ్చిన క్రాక్ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్నే అందుకుంది. రూ.35 కోట్ల‌కు పైగానే షేర్ రాబ‌ట్టింది. మిగ‌తా ఆదాయం కూడా క‌లుపుకుంటే రూ.50 కోట్లకు పైగానే ఆదాయం వ‌చ్చిన‌ట్లు.

ఐతే దీని త‌ర్వాత ర‌వితేజ న‌టిస్తున్న సినిమా మీద ఏకంగా రూ.65 కోట్ల బ‌డ్జెట్ పెట్టేస్తున్నారంటే షాక‌వ్వాల్సిందే. ఇదేమీ రూమ‌ర్ కూడా కాదు. స్వ‌యంగా ఆ చిత్ర ద‌ర్శ‌కుడు వెల్ల‌డించిన విష‌య‌మే. ఆ చిత్రం ఖిలాడి కాగా.. దీనికి రూ.65 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్న‌ట్లు చెప్పింది దాని ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌నే. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ర‌మేష్‌.. ఖిలాడి ర‌వితేజ కెరీర్లోనే అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కిన చిత్ర‌మ‌ని.. దీనిపై రూ.65 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నామ‌ని వెల్ల‌డించాడు.

ఐతే ఇప్ప‌టిదాకా ర‌వితేజ కెరీర్లో అతి పెద్ద హిట్ అనుకుంటున్న క్రాక్‌కే ఆదాయం రూ.60 కోట్లు కూడా రాన‌పుడు ఖిలాడి మీద రూ.65 కోట్లు ఎలా పెట్టేస్తార‌న్న‌ది ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. క్రాక్ కంటే ముందు మాస్ రాజా నుంచి వ‌చ్చిన డిస్కో రాజాకు వ‌చ్చిన షేర్ రూ.10 కోట్లు కూడా లేదు. దాని మీద రూ.30 కోట్లు పెడితేనే నిర్మాత దారుణంగా న‌ష్ట‌పోయాడు. మ‌రి ఖిలాడి అటు ఇటు అయితే దీని నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ ప‌రిస్థితేంటి? మ‌రి నిజంగా ఈ చిత్రం మీద రూ.65 కోట్లు పెట్టి ఉంటారా.. లేక హైప్ కోసం ఎక్కువ చేసి చెబుతున్నారా అన్న‌ది డౌటు.