కీర్తి సినిమా.. ఇంకోటి ఓటీటీలో!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్‌ను అందరూ ఓటీటీ స్టార్ అంటుంటారు నెటిజన్లు. గత ఏడాది కరోనా లాక్ డౌన్ తర్వాత ఆమె లీడ్ రోల్ చేసిన రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఓటీటీలో విడుదలవడం, ఇంకోటి కూడా ఆ మార్గంలోనే విడుదలయ్యే అవకాశాలుండటమే అందుక్కారణం. నిరుడు జూన్‌లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండి, జనాలు ఇళ్లకే పరిమితం అయిన పరిస్థితుల్లో కీర్తి నటించిన ‘పెంగ్విన్’ మూవీ అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. ఆ తర్వాత ఏడాది చివర్లో కీర్తి మరో చిత్రం ‘మిస్ ఇండియా’ సైతం ఓటీటీ బాట పట్టింది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కావడం తెలిసిందే.

ఐతే ఈ రెండు చిత్రాలకూ పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. కీర్తికీ విమర్శలు తప్పలేదు. సినిమాల్లో విషయం లేకే ఓటీటీలకు ఇచ్చేశారనే కామెంట్లు పడ్డాయి. ఇదే సమయంలో కీర్తి నటించిన మరో చిత్రం ‘గుడ్ లక్ సఖి’ సైతం ఓటీటీలోనే వస్తుందన్నారు కానీ దాని గురించి ఇప్పటిదాకా అప్‌డేట్ లేదు. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసే సంకేతాలైతే ఇప్పటిదాకా కనిపించలేదు. కాగా ఇప్పుడు కీర్తి మరో చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురానున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ చిత్రమే.. సాని కాయిదం.

సాని కాయిదం అంటే తమిళంలో రఫ్ పేపర్ అని అర్థం. కొన్ని నెలల కిందట ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ అయినపుడు ప్రేక్షకులు షాకైపోయారు. ‘దండుపాళ్యం’ సినిమాను తలపించేలా చాలా వయొలెంట్‌గా కనిపించింది ఫస్ట్ లుక్. ఈ చిత్రంతో విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ నటుడిగా మారడం విశేషం.

ఇటు కీర్తి, అటు సెల్వ ఇద్దరూ షాకింగ్ లుక్స్‌తో ఆశ్చర్యపరిచారు. వాళ్లిద్దరూ హంతకుల పాత్రలు చేశారిందులో. ఈ చిత్రాన్ని చాలా వేగంగా పూర్తి చేసేశారు. టాకీ పార్ట్ అంతా అయిపోయిందట. ప్రి ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. అరుణ్ మహేశ్వరన్ అనే దర్శకుడు రూపొందిస్తున్న ఈ వయొలెంట్ మూవీకి ఓటీటీ డీల్ పూర్తయిందని.. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ఇవ్వనున్నారని తమిళ మీడియా అంటోంది. మరి ఈ చిత్రంతో అయినా కీర్తి మంచి ఫలితాన్నందుకుంటుందేమో చూడాలి.