మారుతి ‘భారీ’ సినిమా

యువ దర్శకుడు మారుతి టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టర్. చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ రోజుల్లో, పరిమిత వనరులతో వినోదాత్మక సినిమాలు తీయడం ద్వారా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడతను. అర కోటి కూడా ఖర్చవని ‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో అతడి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కూడా తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసి పెద్ద హిట్లు కొట్టాడు.

తర్వాత నాని, వెంకటేష్ లాంటి స్టార్లతో సినిమాలు తీశాడు. ఇప్పుడు స్టార్లతో సినిమాలు చేస్తున్నా కూడా మారుతి మరీ ఎక్కువ ఖర్చు పెట్టించడని.. అనవసర హంగామాకు పోడని అంటారు. యూత్‌కు, ఫ్యామిలీస్‌కు నచ్చే సింపుల్ ఎంటర్టైనర్లతో అతడి ప్రయాణం సాగిపోతోంది. ఇలాంటి దర్శకుడి నుంచి గ్రాఫిక్స్ ప్రధానంగా ఒక భారీ విజువల్ వండర్ వస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే విచిత్రంగా అనిపిస్తోంది కదా? మారుతి అలాంటి సినిమా తీయగలడా అన్న సందేహాలు కూడా కలుగుతాయి.కానీ తాను ఆ టైపు సినిమా తీయగలనని అంటున్నాడు మారుతి.

ఈ తరహా చిత్రాలకు పని చేసిన అనుభవం కూడా తనకు ఉందని మారుతి చెప్పాడు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్కెచింగ్ చేయడం, స్గోరీ బోర్డ్ వేయడం లాంటి పనులు చేశానని.. ఆ క్రమంలో ‘అంజి’ లాంటి భారీ చిత్రానికి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి పిలిచి అవకాశం ఇచ్చారని.. ఆ అనుభవం తనకెంతో ఉపయోగపడిందని ఓ టీవీ కార్యక్రమంలో మారుతి వెల్లడించాడు.

గ్రాఫిక్స్ ప్రధానంగా సినిమాలు తీయగలరా అని అడిగితే.. కచ్చితంగా చేయగలనని.. తాను ఆ తరహా సినిమా చేస్తే అది నెక్స్ట్ లెవెల్ విజువల్ వండర్‌గా ఉంటుందని తెలిపాడు మారుతి. భవిష్యత్తులో కచ్చితంగా ఈ తరహా భారీ చిత్రం చేస్తానని మారుతి ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతను గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ తీస్తున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందు అతడి నుంచి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే చిత్రం రాబోతోంది.