ఆ మెగా ప్రాజెక్టుకు మ‌హేష్ బాబు నో?


టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మధు మంతెన క‌లిసి రామాయ‌ణ గాథ నేప‌థ్యంలో ఓ భారీ చిత్రం తీయ‌డానికి కొన్నేళ్ల కింద‌ట స‌న్నాహాలు మొదుల‌పెట్టిన సంగతి తెలిసిందే. వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్లో రామాయ‌ణం సినిమా వ‌స్తుంద‌ని కొన్నేళ్ల కింద‌టే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంది.

ఐతే ఈ ఏడాది చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికి చూస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్ప‌టికే కొన్ని ఊహాగానాలు న‌డిచాయి. ఐతే నిర్మాత‌ల్లో ఒక‌రైన మ‌ధు మంతెన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ద‌స‌రాకు ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ప్ర‌కటించాడు. ఇక అప్ప‌ట్నుంచి ఈ సినిమాలో ముఖ్య తారాగ‌ణం గురించి ఊహాగానాలు మ‌రింత ఊపందుకున్నాయి.

ప్ర‌స్తుతానికి హృతిక్ రోష‌న్, దీపికా ప‌దుకొనే ఈ రామాయ‌ణం సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌న టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సైతం ఓ కీల‌క పాత్ర చేస్తాడ‌ని ముందు నుంచి ఊహాగానాలు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే తాజా సమాచారం ప్ర‌కారం మ‌హేష్ ఈ సినిమాకు నో చెప్పేశాడ‌ట‌.

అత‌ణ్ని ఈ సినిమాకు సంప్ర‌దించ‌డం వాస్త‌వ‌మే అని.. ఐతే ఈ చిత్రానికి బ‌ల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉండ‌టం, రాజ‌మౌళితో చేయాల్సిన సినిమాతో క్లాష్ అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో మ‌హేష్ ఈ ప్రాజెక్టును అంగీక‌రించ‌లేని స్థితిలో ప‌డ్డాడ‌ని జోరుగా ప్రచారం సాగుతోంది. మహేష్ నో చెప్పేయ‌డంతో సౌత్ నుంచే మ‌రో స్టార్ హీరోతో ఈ పాత్ర చేయించాల‌ని చూస్తున్నార‌ట మేక‌ర్స్. దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితీశ్ తివారి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మెగా మూవీ తెర‌కెక్క‌నుంది. మహేష్-రాజమౌళి చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.