అఖిల్ కోసం మమ్ముట్టికి 3 కోట్లు ఇస్తున్నారట!

Akhil

గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ అనే ఆలోచనలు ఎక్కువైపోయాయి. అందుకే తెలుగు సినిమాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ఒకప్పుడు కూడా ఇలా చేసేవారు కానీ ఇప్పుడు కంపల్సరీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పరభాషా నటీనటులు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు మన నిర్మాతలు. పైగా సినిమాలో వారి క్యారెక్టర్లను కూడా బాగా డిజైన్ చేస్తున్నారు.

ఇప్పుడు మలయాళ హీరో మమ్ముట్టికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి టాలీవుడ్ కి తీసుకొస్తున్నారు. అక్కినేని అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘ఏజెంట్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో ఓ ప్రధాన పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించారు. దాని కోసం మమ్ముట్టి రూ.3 కోట్లు డిమాండ్ చేశారట. అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ఓకే చెప్పేశారు.

మలయాళంలో మమ్ముట్టి పెద్ద స్టార్ హీరో. కానీ ఈ మధ్యకాలంలో ఆయన హవా కాస్త తగ్గింది. ఆయన సినిమాలు పెద్దగా ఆడడం లేదు. ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. అయినప్పటికీ ఆయనకి మూడు కోట్లు ఇవ్వడానికి ‘ఏజెంట్’ టీమ్ రెడీ అయింది. సురేందర్ రెడ్డి తన సినిమాలను ఎంతో స్టైలిష్ గా తెరకెక్కిస్తుంటారు. మమ్ముట్టి పాత్ర కూడా చాలా క్లాస్ గా ఉంటుందట. కానీ విలన్ రోల్ మాత్రం కాదు. మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి!