నాని స్పీడే స్పీడబ్బా


తెలుగులో చాలా వేగంగా సినిమాలు చేసుకుపోయే హీరోల్లో నాని ఒకడు. ఒకప్పుడైతే నాని సినిమాల బడ్జెట్లు, బిజినెస్‌ల రేంజ్ తక్కువుండేది. చకచకా సినిమా అవగొట్టేసేవాడు. కానీ ఇప్పుడు అతడి సినిమా స్థాయి పెరిగింది. అతను మిడ్ రేంజ్ స్టార్ అయ్యాడు. అతడి సినిమాల మీద రూ.30 కోట్లకు మించి బడ్జెట్లు పెడుతున్నారు. అందులోనూ ‘శ్యామ్ సింగరాయ్’ అయితే నాని కెరీర్లోనే అత్యధికంగా.. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతోంది. నాని కెరీర్లోనే ఏ చిత్రానికీ లేనంత వర్క్.. శ్రమ ఈ సినిమాతో ముడిపడి ఉన్నాయి.

మూడు దశాబ్దాల కిందటి కోల్‌కతా నగర నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. దీని కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు పెట్టి కోల్‌కతా సిటీ సెట్ వేశారు. మధ్యలో కొన్ని రోజులు కోల్‌కతాకు కూడా వెళ్లి వచ్చింది చిత్ర బృందం. లాక్ డౌన్ రాకుంటే ఈపాటికి సినిమా విడుదలకు సిద్ధం అయ్యేదే. మధ్యలో విరామం వచ్చినా సరే.. సినిమా మరీ ఏమీ ఆలస్యం కాలేదు.

లాక్‌డౌన్‌కు ముందే మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ఇంత భారీ చిత్రాన్ని కూడా నాని మొత్తంగా మూడు నెలల్లో పూర్తి చేసేయబోతుండటం విశేషం. ఇంకో రెండు వారాల్లోనే షూటింగ్ అయిపోతుందట. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయినంత వరకు లాక్ డౌన్ బ్రేక్‌లో నాని డబ్బింగ్ కూడా ఫినిష్ చేసినట్లు తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొంత వరకు జరిగాయట. ఇంకో నెలన్నర కల్లా ‘శ్యామ్ సింగరాయ్’ రెడీ అయిపోతుందని తెలుస్తోంది.

నాని ఇప్పటికే ‘టక్ జగదీష్’ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. అది ఆగస్టులో రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజవుతుంది. ఈ ఏడాది నాని రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుండటం ఖాయం. ‘శ్యామ్ సింగ రాయ్’ పని పూర్తవగానే ‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్‌తో నాని ‘అంటే సుందరానికి’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు నాని.