ఓటీటీ రిలీజ్‌కు నితిన్ సినిమా?

ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెన‌క్కి అన్న‌ట్లు సాగుతోంది యువ క‌థానాయ‌కుడు నితిన్ కెరీర్. వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత భీష్మతో ఫామ్ అందుకున్నాడ‌నుకుంటే.. ఈ మ‌ధ్య చెక్, రంగ్‌దె సినిమాల‌తో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు ప‌రాజ‌యాలు ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించిన‌ ప‌వ‌ర్ పేట చిత్రాన్ని ప‌క్క‌న పెట్టేసి ఇప్పుడు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా మొద‌లుపెడుతున్నాడు నితిన్.

దాని కంటే ముందు అంధాదున్ రీమేక్ మాస్ట్రోను నితిన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన‌ట్లు కూడా తాజాగా వెల్ల‌డించారు. కాగా ఈ చిత్రానికి థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్‌తో చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని.. డిజిట‌ల్ రిలీజ్‌కే సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మాస్ట్రో సినిమాను త‌క్కువ బ‌డ్జెట్లో, త‌క్కువ రోజుల్లో పూర్తి చేసేశారు. మంచి లాభానికే ఓటీటీ డీల్ రావ‌డంతో ఆ మార్గంలోనే సినిమాను రిలీజ్ చేసేద్దామ‌నుకుంటున్నార‌ట‌. క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు మ‌ళ్లీ థియేట‌ర్ ఇండ‌స్ట్రీ కుదేలైంది. మ‌ళ్లీ పూర్తి స్థాయిలో బిగ్ స్క్రీన్ల‌లో సినిమాలు న‌డ‌వ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. పైగా రెండు వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత నితిన్ నుంచి ఓ రీమేక్ మూవీ వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో ఆశించినంత ఆస‌క్తి ఉండ‌క‌పోవ‌చ్చు.

ఈ నేప‌థ్యంలో సినిమా థియేట‌ర్ల‌లో రిలీజై అటు అయితే నితిన్ కెరీర్‌కు ఇబ్బందే. అందుకే మాస్ట్రోను ఓటీటీలో రిలీజ్ చేయ‌డానికి రెడీ అయిపోయారంటున్నారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ రూపొందించిన ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా న‌భా న‌టేష్ న‌టించింది. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించంది. నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌డం విశేషం.