హీరోయిన్లను పెళ్లి చేసుకోవద్దంటున్న పూరి!

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పాడ్ కాస్ట్ పేరుతో పలు విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తున్నాడు. ఇప్పటికే ప్రేమ, పెళ్లి, ట్రావెలింగ్ వంటి విషయాలపై మాట్లాడిన పూరి తాజాగా హీరోయిన్లకు సలహా ఇచ్చారు. సినిమా హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుంటే తనకు నచ్చదని అంటున్నారు పూరి. కోటి మందిలో ఒక్కరికి మాత్రమే హీరోయిన్ అయ్యే ఛాన్స్ వస్తుందని.. అందుకే వాళ్లు ఎంతో స్పెషల్ అని అన్నారు. వాళ్లు కూడా అందరిలానే పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కంటే తనకు నచ్చడం లేదని అన్నారు.

హీరోయిన్లను అభిమానులు దేవతల్లా భావిస్తుంటారని.. అలాంటి దేవతలు మెటర్నటీ వార్డ్ లో నొప్పులు పడుతుంటే చూడలేనని అన్నారు. మనందరం పూజించే నిజమైన దేవతలు కూడా ఎప్పుడూ పిల్లలని కనలేదని అన్నారు. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు ఉంటుందని.. దేవతలకు కాదని.. కాబట్టి మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉంటే మాకిష్టం అంటూ హీరోయిన్లను ఉద్దేశిస్తూ పూరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణ అమ్మాయిలతో పోలిస్తే హీరోయిన్లు అన్ని విషయాల్లో ఎంతో స్ట్రాంగ్ గా ఉంటారని.. మీరైనా మగాడ్ని దూరం పెట్టొచ్చు కదా..! ప్రేమ లేకపోతే చచ్చిపోతారా..? అంటూ ప్రశ్నించారు పూరి.

జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ ఇలా చాలా మంది మహిళలు స్ఫూర్తి నింపడానికి ఉన్నారని అన్నారు. పురాణాల్లో కూడా సింగిల్ విమెన్ ఉన్నారని.. ఉదాహరణగా హిడింబి గురించి చెప్పారు పూరి. అలానే హాలీవుడ్ లో పెళ్లిని పక్కన పెట్టి సూపర్ స్టార్స్ అయిన హీరోయిన్ల గురించి ప్రస్తావించారు. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలకు పెళ్లి కాలేదు కాబట్టే స్వర్గంపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారని అన్నారు. ‘రైజింగ్ ట్రైబ్ ఆఫ్ సింగిల్ విమెన్’ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలవుతుందని అన్నారు. హీరోయిన్లు మాత్రమే కాకుండా.. స్ట్రాంగ్ విమెన్ ఎవరూ కూడా పెళ్లిళ్లు చేసుకోవద్దని.. మంగళసూత్రం మర్చిపోండని చెప్పారు.