శ్రీనువైట్ల మల్టీస్టారర్!

వరుస హిట్స్ తో ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీనువైట్ల. అయితే గత కొన్నేళ్లుగా ఆయన నుండి ఒక్క హిట్టు సినిమా కూడా రాలేదు. ఆయన తెరకెక్కించిన ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో తన తదుపరి సినిమా మొదలుపెట్టడానికి చాలా టైమ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఢీ అండ్ ఢీ’ అనే సినిమా తీస్తున్నారు. ‘డబుల్ డోస్’ అనేది ట్యాగ్ లైన్. మంచు విష్ణు హీరోగా త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు.

ఈలోగా మరో రెండు కథలను సిద్ధం చేసుకున్నారు శ్రీనువైట్ల. అందులో ఒక దానికి ‘డబుల్స్’ అనే టైటిల్ పెట్టుకున్నారు. ఇదొక మల్టీస్టారర్ అని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇందులో స్టార్ హీరోలే కనిపిస్తారని సమాచారం. కానీ ఆ హీరోలు ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. ఇదిలా ఉండగా.. ‘ఢీ అండ్ ఢీ’ సినిమాకి ‘డబుల్స్’ కి మధ్య మరో సినిమా ఉంటుందని.. ఆ సినిమా తరువాతే ‘డబుల్స్’ సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు శ్రీనువైట్ల.

ఇక సీక్వెల్స్ గురించి మాట్లాడుతూ.. ‘ఢీ అండ్ ఢీ’ సినిమా అందరూ అనుకుంటున్నట్లుగా ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ కాదని.. పూర్తిగా వేరే కథ అని చెప్పారు. కానీ సినిమా చూస్తున్న ఏదోక క్షణంలో ‘ఢీ’ గుర్తొస్తుందని అన్నారు. అలానే ‘దూకుడు’ సీక్వెల్ గురించి మాట్లాడుతూ అసలు తనకు సీక్వెల్ తీయాలనే ఆలోచనే లేదని అన్నారు. సీక్వెల్స్ తో మ్యాజిక్ ను రిపీట్ చేయలేమని అన్నారు. మహేష్ తో సినిమా ఛాన్స్ వస్తే.. దూకుడు కంటే మంచి కథతో వెళ్లాలని చెప్పుకొచ్చారు.