మరో హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్!

రీసెంట్ గా హీరోయిన్ ప్రణీత సుభాష్ బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ సైలెంట్ గా పెళ్లి చేసేసుకొని వార్తల్లో నిలిచింది. ఆమె మరెవరో కాదు.. యామీ గౌతమ్. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ యాడ్ తో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

ఆ తరువాత తెలుగులో ‘నువ్విలా’,’గౌరవం’ లాంటి సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె చివరిగా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’లో కనిపించింది. ప్రస్తుతం నటిగా కొన్ని సినిమాలు చేస్తోన్న ఈమె రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను పెళ్లాడింది. కోవిడ్ నిబంధనల కారణంగా అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. శుక్రవారం నాడు వీరి వివాహం జరగగా.. ఈ విషయాన్ని యామీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

యామీ పెళ్లి చేసుకున్న దర్శకుడు ఆదిత్య ‘ఉరి’ సినిమాతో బాలీవుడ్ లో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగునాట కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో యామీ గౌతమ్ కూడా కీలకపాత్ర పోషించింది. అప్పటినుండే వీరి స్నేహం మరింత బలపడి పెళ్లి వరకు వచ్చిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచురిస్తున్నారు. ప్రస్తుతం ఆదిత్య.. విక్కీ కౌశల్ హీరోగా ‘ద ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.