మే 31న పేలిపోయే అనౌన్స్‌మెంట్?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మే 31వ తేదీ ఎంత ప్ర‌త్యేకంగా భావిస్తాడో తెలిసిందే. అది నిన్న‌టిత‌రం సూప‌ర్ స్టార్, మ‌హేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజ‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి ఏడాదీ ఆ తేదీన తండ్రికి, త‌మ కుటుంబ అభిమానులకు ఏదో ఒక కానుక ఇవ్వ‌డం మ‌హేష్‌కు అల‌వాటు.

ఎక్కువ‌గా కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్‌, లేదంటే మేకింగ్ ద‌శ‌లో ఉన్న సినిమాల అప్ డేట్స్ ఉండేలా చూసుకుంటాడు మ‌హేష్‌. ఈ ఏడాది సినిమా కార్య‌క‌లాపాలేమీ లేక‌పోయినా.. ఒక పెద్ద అనౌన్స్‌మెంట్‌తో ఆ తేదీని ప్ర‌త్యేకంగా మార్చాల‌ని మ‌హేష్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. మ‌హేష్ కొత్త సినిమా ప్ర‌క‌ట‌న ఆ రోజే ఉంటుంద‌ట‌. ఆ రోజు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తాజా స‌మాచారం.

ముందు అనుకున్న ప్ర‌కార‌మైతే స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేష్ మ‌హ‌ర్షి ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్టు న‌చ్చ‌క ఆ చిత్రం క్యాన్సిల్ అయింది. దీంతో ఊహించ‌ని విధంగా ప‌ర‌శురామ్ లైన్లోకి వ‌చ్చాడు. గీత గోవిందం త‌ర్వాత ప‌ర‌శురామ్ సినిమా కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించిన స్టార్ హీరోల్లో మ‌హేష్ ఒక‌డు. వారి మ‌ధ్య కొన్ని రోజులు క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయి.

కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు క‌ద‌ల్లేదు. వంశీ సైడ‌య్యాక ప‌ర‌శురామ్‌ను మ‌ళ్లీ పిలిపించాడు. కొన్ని సంప్ర‌దింపుల త‌ర్వాత సినిమా ఓకే అయింది. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో తాను మ‌హేష్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు, అది ఒక రేంజ్‌లో ఉండ‌బోతున్న‌ట్లు ప‌ర‌శురామ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. మ‌రి 31న మ‌హేష్ అభిమానులు ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.