ఫ్యామిలీ మ్యాన్ గొడవ పై వాళ్లేమన్నారు?

‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. ఆ సిరీస్ మీద వివాదం ముసురుకోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. ఇందులో సమంత పోషించిన ఎల్టీటీఈ టెర్రరిస్టు పాత్ర పట్ల తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తున్నారన్నది వారి వాదన. దీనిపై ఓ ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాయడం, ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కోరడంతో ఎక్కడ ఈ షోకు బ్రేక్ పడుతుందో అన్న భయాలు నెలకొన్నాయి.

జూన్ 4 నుంచి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. తమ సిరీస్ ట్రైలర్ వివాదానికి దారి తీసిన నేపథ్యంలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ దర్శకుడు రాజ్-డీకే స్పందించారు. ట్రైలర్ చూసి ఒక అంచనాకు రావొద్దని కోరారు. అందరూ అనుకుంటున్నట్లు తాము ఈ సిరీస్‌ను ఎవరి మనోభావాలు దెబ్బ తీసేలా రూపొందించలేదన్నారు.

“ఫ్యామిలీ మ్యాన్-2 విడుదలయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒకసారి మీరు ఈ షో చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రశంసిస్తారని మాకు తెలుసు. ట్రైలర్‌లో కొన్ని షాట్లు మాత్రమే చూసి కొంత మంది కథాం శం అంచనా వేస్తున్నారు. సిరీస్‌ను తప్పుగా చూస్తున్నారు. ఈ షోలో ప్రధాన తారాగణంతో పాటు మా టీంలో చాలామంది తమిళులున్నారు. మాకు కూడా తమిళ ప్రజల మనోభావాలు, వారి సంస్కృతి పట్ల బాగా అవగాహ న ఉంది.

అలాంటపుడు వారిని బాధ పెట్టేలా షోను ఎందుకు రూపొందిస్తాం? ఈ షో రూపకల్పనలో ఎన్నో సంవత్సరాల కష్టం దాగివుంది. సీజన్‌-1లో ఏ విధంగా అయితే సున్నితమైన, సమతూకం ఉన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడ్డామో అదే రీతిలో ఈ సీజన్‌ కోసమూ కష్టపడ్డాము. కాబట్టి షో స్ట్రీమ్ అయ్యే వరకు అందరూ ఎదురు చూసి తర్వాత ఇందులోని కంటెంట్ మీద ఒక అంచనాకు రావాల్సిందిగా కోరుతున్నాం” అని రాజ్-డీకే అన్నారు.