తెలంగాణ థియేటర్లలో రోజుకు రెండు షోలే


కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి గత కొన్ని రోజుల్లో ఒక్కసారిగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పుతున్నా ప్రభుత్వాలు ఇన్ని రోజులు చూసి చూడనట్లు ఉండిపోయాయి. కానీ ఎన్నికలు అయిపోగానే ప్రభుత్వాలు ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయాయి. ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక పూర్తి కావడం ఆలస్యం.. కరోనా షరతులు మొదలయ్యాయి. 9వ తరగతి లోపు విద్యార్థులకు సెలవులిచ్చేశారు. పాఠశాలలు మూసి వేయిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు మాత్రమే కొనసాగిస్తున్నారు.

థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడంతో పాటు మరికొన్ని షరతులు పెట్టారు. ఇదే కోవలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తం అయింది. నైట్ కర్ఫ్యూ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సామాన్యులెవరూ బయట తిరగడానికి వీల్లేదు. కొన్ని వర్గాలకు మాత్రమే మినహాయింపును ఇచ్చారు.

నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణలో సెకండ్ షోలు క్యాన్సిల్ కాబోతున్నాయి. 9 గంటలకు కర్ఫ్యూ నేపథ్యంలో ఆ సమయం వరకు షోలు నడిపినా కుదరదు. రాత్రి 8 గంటలకే షోలు ముగించాలని ఆదేశాలు జారీ చేశారు. మల్టీప్లెక్సులైతే ఒక నిర్దిష్ట సమయం ఏమీ లేకుండా షోలు నడిపించుకుంటాయి. సరిగ్గా 8 గంటలకు షోలు అయ్యేలా ప్లాన్ చేసుకుంటాయి. కానీ సింగిల్ స్క్రీన్లలో అలా కుదరదు. ఫస్ట్ షోలు 6.14-6.30 మధ్య మొదలై నిడివిని బట్టి 8.30-9 గంటల మధ్య ముగుస్తుంటాయి. ఇప్పుడు సరిగ్గా 8 గంటలకే షోలు ముగించాలంటే ఫస్ట్ షోలు నడిపించడం కష్టం.

ఇప్పటికిప్పుడు ఉదయం నుంచి షోల టైమింగ్స్ మార్చి.. సాయంత్రం 5 గంటలకే ఫస్ట్ షో పడేలా మార్పులు చేయడం కష్టమేమో. అందులోనూ ‘వకీల్ సాబ్’ చల్లబడిపోయింది. కొత్తగా పేరున్న సినిమాలేవీ లేవు. ఈ నేపథ్యంలో రోజుకు రెండు షోలతో సింగిల్ స్క్రీన్లను ఏం నడిపిస్తారో చూడాలి. మరోవైపు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా అమల్లోకి రావచ్చంటున్నారు. మొత్తంగా థియేటర్లకు మళ్లీ గడ్డు కాలం మొదలైనట్లే ఉంది.