చైతూతో అనుకుంటే అఖిల్‌తో సెట్ అయిందా?


‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్లోకి అజయ్ భూపతి. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన ఈ యువ దర్శకుడు ‘ఆర్ఎక్స్ 100’తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా సాధించిన విజయం చూసి.. అజయ్ బిజీయెస్ట్ డైరెక్టర్లలో ఒకడైపోతాడనుకున్నారు. ఐతే రెండో సినిమా పట్టాలెక్కించడానికి అతను చాలా టైమే తీసుకున్నాడు. రకరకాల కారణాల వల్ల ‘ఆర్ఎక్స్ 100’ రిలీజైన రెండేళ్లకు కానీ రెండో సినిమా ‘మహాసముద్రం’ను అతను మొదలుపెట్టలేకపోయాడు.

శర్వానంద్-సిద్దార్థ్-అదితిరావు హైదరిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జోరుగానే సాగుతోంది. త్వరలోనే సినిమా పూర్తవుతుంది. ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేశారు. రెండో సినిమా విషయంలో జరిగిన ఆలస్యం.. మూడో సినిమాకు జరగకుండా అజయ్ భూపతి తెలివిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ‘మహాసముద్రం’ పూర్తయిన వెంటనే తన తర్వాతి చిత్రాన్ని అతను మొదలుపెట్టేయనున్నాడట.

మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో అజయ్ మూడో సినిమా ఉంటుందట. ఈ సినిమాకు హీరోగా వినిపిస్తున్న పేరు ఆశ్చర్యం కలిగించేదే. అక్కినేని అఖిల్ ఇందులో కథానాయకుడిగా నటిస్తాడట. హీరోగా తొలి మూడు సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ.. అఖిల్‌కు అవకాశాలకేమీ లోటు లేదు. నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల కాకుండానే.. సురేందర్ రెడ్డి లాంటి పెద్ద దర్శకుడితో ‘ఏజెంట్’ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. దీని తర్వాత అతను అజయ్ భూపతి సినిమాకు కమిటయ్యాడట.

ఈ దశలో పెద్ద నిర్మాణ సంస్థ, క్రేజీ డైరెక్టర్ అఖిల్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారంటే విశేషమే. నిజానికి అఖిల్ అన్నయ్య నాగచైతన్యతో అజయ్ భూపతి పని చేయాల్సింది. ‘మహా సముద్రం’లో ఓ హీరోగా చైతూనే అనుకున్నాడతను. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కానీ ఎందుకో వీళ్లిద్దరికీ సెట్ కాలేదు. ఇప్పుడు అఖిల్‌తో అజయ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.