రామావ‌తారంలో ప్ర‌భాస్‌.. ముహూర్తం ఫిక్స్

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఆ స్థాయిలో చేయ‌బోతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆదిపురుష్‌. గ‌త ఏడాది ఇండియాలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చారిత్ర‌క చిత్రం తానాజీ రూప‌క‌ర్త ఓం రౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రామాయ‌ణ గాథ‌ను ఈ సినిమా ద్వారా ఇప్పుడున్న టెక్నాల‌జీతో భారీ స్థాయిలో వెండితెర‌పైకి తేవ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

బాహుబ‌లిలో చ‌క్ర‌వ‌ర్తి అవ‌తారంలో అంద‌రినీ మెస్మ‌రైజ్ చేసిన ప్ర‌భాస్.. రాముడి అవ‌తారంలో ఎలా ఉండ‌బోతున్నాడ‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. ఆ అవ‌తారంలో అత‌ణ్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఉత్కంఠ‌తో ఉన్నారు అభిమానులు. ఇందుకు ముహూర్తం ఇప్ప‌టికే కుదిరిన‌ట్లు స‌మాచారం. ఇంకో నెల రోజుల్లోపే ప్ర‌భాస్‌ను రామావ‌తారంలో చూడ‌బోతున్నామ‌న్న‌ది తాజా క‌బురు.

ఏప్రిల్ 21న శ్రీరామ న‌వ‌మి పండుగ రాబోతోంది. ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేయ‌డానికి ఇంత‌కంటే మంచి ముహూర్తం మ‌రొక‌టి ఉండ‌ద‌ని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్ప‌టికే ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. రాముడిగా ప్ర‌భాస్ మేక‌ప్ కూడా వేసుకున్నాడు. కొన్ని స్టిల్స్ కూడా తీశారు. అందులోంచి ఉత్త‌మమైంది తీసుకుని.. దానికి మ‌రిన్ని మెరుగులు దిద్ది ఫ‌స్ట్ లుక్ వ‌ద‌లాల‌ని చిత్ర బృందం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కున్న ఈ చిత్రాన్ని ఓం రౌత్, భూషణ్ కుమార్‌ల‌తో పాటు ఇంకో ముగ్గురు నిర్మాత‌లు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీతగా కృతి స‌న‌న్, రావ‌ణుడిగా సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్నారు. దాదాపు ఏడాది పాటు ప్రి ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేశాక ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లారు. సినిమాలో స‌గం బ‌డ్జెట్‌ను విజువల్ ఎఫెక్ట్స్ కోస‌మే కేటాయించ‌డం విశేషం.