నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తే పాయె

ఒకప్పుడు థియేటర్లలో రిలీజయ్యాక కొన్ని సంవత్సరాలకు కానీ టీవీల్లోకి వచ్చేవి కాదు కొత్త సినిమాలు. కానీ గత కొన్నేళ్లలో ఓటీటీ విప్లవం పుణ్యమా అని పరిస్థితులు వేగంగా మారిపోయాయి. థియేట్రికల్ రిలీజ్‌‌కు.. డిజిటల్, శాటిలైట్ రిలీజ్‌కు మధ్య గ్యాప్ బాగా తగ్గుతూ వచ్చింది. థియేటర్లలో రిలీజైన నెల రోజులకే కొత్త సినిమాను టీవీలు, మొబైళ్లలో చూసుకునే అవకాశం లభించింది.

ఇక గత ఏడాది కరోనా పుణ్యమా అని తలెత్తిన లాక్ డౌన్ కారణంగా కొత్త సినిమాలు పెద్ద ఎత్తున నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. ఐతే అప్పటి పరిస్థితుల దృష్ట్యా అది అనివార్యం అయింది. ఐతే మళ్లీ థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో మునుపటి లాగే నెలా నెలన్నర వ్యవధిలోనే డిజిటల్లో కొత్త సినిమాలు రిలీజవుతాయని అనుకున్నారు. కానీ కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన వారం రెండు వారాలకే ఓటీటీల్లో రిలీజైపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సంక్రాంతి సినిమాల్లో ‘మాస్టర్’ థియేటర్లలో బాగా ఆడుతుండగానే, రెండు వారాలకే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ‘క్రాక్’ సైతం అలాగే రిలీజ్ కావాల్సింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వేడుకోలుతో వారం ఆలస్యంగా వచ్చింది. ఇప్పుడైతే థియేటర్లలో వచ్చిన వారానికే చిన్న సినిమాలు డిజిటల్లో రిలీజవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫిబ్రవరి 26న థియేటర్లలో దిగిన ‘అక్షర’ సరిగ్గా వారానికే ప్రైమ్‌లోకి వచ్చేసింది. తాజాగా గత గురువారం విడులైన ‘గాలి సంపత్’ కూడా వారానికే ఆహాలో రిలీజ్ కాబోతోంది. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రాన్ని కూడా థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఆహాలో రిలీజ్ చేస్తారని అంటున్నారు.

ఇలా కొత్త సినిమాలు అంత వేగంగా డిజిటల్లో రిలీజైతే.. ఇక జనాలు థియేటర్లకు ఏం వస్తారన్నది ప్రశ్నార్థకం. పెద్ద సినిమాలైనా థియేటర్లలో చూసేందుకు పోటీ పడతారు కానీ.. చిన్న సినిమాలు చూసేందుకు థియేటర్లకు రావడమే తక్కువ. పైగా ఇలా వారం, రెండు వారాలకే డిజిటల్లో వరుసబెట్టి సినిమాలు రిలీజవుతుంటే.. వాటి కోసం థియేటర్లకు వెళ్లడం గగనమే అవుతుంది. దీని కన్నా ఇలాంటి చిన్న సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ చేసేయడమే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.