‘దృశ్యం-2’ చూసి రాజమౌళి ఫ్లాట్

ఈ మధ్య కాలంలో భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన సినిమా అంటే ‘దృశ్యం-2’నే. ఇది మలయాళం సినిమానే అయినా.. అమేజాన్ ప్రైమ్‌లో సబ్‌టైటిల్స్ పెట్టుకుని వివిధ భాషల వాళ్లు విరగబడి చూశారు. అందుక్కారణం.. ఇది ఆరేళ్ల కిందట వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘దృశ్యం’కు సీక్వెల్ కావడం, తొలి భాగానికి ఏమాత్రం తగ్గని విధంగా ఉత్కంఠభరితంగా సాగడమే.

నిజానికి ఈ సినిమాపై జనాల్లో పెద్దగా అంచనాలు లేవు. ‘దృశ్యం’కు సీక్వెల్ అంటూ క్యాష్ చేసుకునే ప్రయత్నం లాగే కనిపించింది చాలామందికి. కానీ ప్రేక్షకులకు షాకుల మీద షాకులిస్తూ.. ఎంతో ఉత్కంఠభరితంగా, పకడ్బందీగా కథను నడిపిస్తూ గొప్ప అనుభూతిని పంచాడు దర్శకుడు జీతు జోసెఫ్. ఇప్పుడీ సినిమాకు తెలుగులో రీమేక్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వేరే భాషల్లోనూ ఇది రీమేక్ అయ్యే అవకాశాలున్నాయి. తాజాగా మన దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ సినిమా చూశాడు.

‘దృశ్యం-2’ చూసి మెస్మరైజ్ అయిపోయిన రాజమౌళి.. దర్శకుడు జీతు జోసెఫ్ నంబర్ తీసుకుని ఆయన్ని పొగుడుతూ పర్సనల్ మెసేజ్ పెట్టాడు. జీతు ఆ మెసేజ్‌ను మీడియాతో పంచుకున్నాడు. ‘‘హాయ్ జీతు. నేను సినీ దర్శకుడు రాజమౌళిని. కొన్ని రోజుల కిందట ‘దృశ్యం-2’ చూశా. అప్పట్నుంచి అది నన్ను వెంటాడుతోంది. వెంటనే మళ్లీ దృశ్యం ఫస్ట్ పార్ట్ చూశా. ఇంతకుముందు నేను తెలుగు దృశ్యం రిలీజైనపుడు చూశా. దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నటన.. అన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పగలను. కానీ అన్నింటికీ మించి రైటింగ్ మరో స్థాయిలో ఉంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తగ్గనట్లు ఉంది. దృశ్యం ఫస్ట్ పార్ట్ ఒక మాస్టర్ పీస్ అయితే.. రెండో భాగాన్ని అంతే పకడ్బందీ కథతో తీర్చిదిద్దడం.. అంతే బిగువుతో కథనం ఉండటం అద్భుతమైన విషయం. ఇలాంటి మరెన్నో మాస్టర్ పీస్‌లు మీ నుంచి రావాలని కోరుకుంటున్నా’’ అని రాజమౌళి ఈ మెసేజ్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇండియాలోనే నంబర్ వన్ దర్శకుడిగా పేరున్న రాజమౌళి నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో జీతు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లే ఉన్నాడు.