ఆ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదరహో

కొన్ని సినిమాలు మొదలైనపుడు, మేకింగ్ దశలో ఉన్నపుడు మామూలుగానే అనిపిస్తాయి. చిన్న స్థాయివి గానే కనిపిస్తాయి. కానీ రిలీజ్ ముంగిట వాటికి అనుకోని హైప్ వస్తుంది. ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతాయి. బంపర్ ఓపెనింగ్స్ వస్తాయి. గత నెలలో వచ్చిన ‘ఉప్పెన’ చిత్రానికి ఇలాగే అన్నీ భలేగా కలిసొచ్చాయి. కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమా అయినప్పటికీ దానికి ఓ పెద్ద సినిమా స్థాయిలో హైప్ వచ్చింది. రిలీజ్ తర్వాత ఆ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇ

ప్పుడు ‘జాతిరత్నాలు’ సైతం ఈ కోవలోకే చేరేలా కనిపిస్తోంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి ఇమేజ్ లేని నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేశారు. ‘పిట్టగోడ’ అనే ఫ్లాప్ మూవీ తీసిన అనుదీప్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అయితేనేం ఈ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ మామూలుగా లేదు.

పాటలు, మిగతా ప్రోమోలు చాలా ప్రామిసింగ్‌‌గా, ఫన్నీగా అనిపించడంతో ‘జాతిరత్నాలు’పై ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ప్రమోషన్ కూడా కొంచెం గట్టిగా చేయడంతో సినిమా హైప్ పెరిగిపోయింది. దాని ఫలితం ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తోంది. శర్వానంద్ లాంటి స్టార్ నటించిన ‘శ్రీకారం’ పోటీలో ఉండగా.. దాన్ని మించి ‘జాతిరత్నాలు’కు అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. పెట్టిన టికెట్లు పెట్టినట్లే అయిపోతున్నాయి. షోలకు షోలు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. హైదరాబాద్ సిటీలో మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి ‘జాతి రత్నాలు’కు 220 షోలకు బుకింగ్స్ తెరిస్తే అందులో 130 దాకా సోల్డ్ ఔట్ దశలో ఉండటం విశేషం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రధాన సిటీల్లోనూ ఇదే పరిస్థితి. విడుదలకు రెండు రోజుల ముందే ఈ పరిస్థితి ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. రిలీజ్ సమయానికి ఫస్ట్ డే అన్ని షోలూ ఫుల్స్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. చూస్తుంటే బిగ్ వీకెండ్ ‘జాతిరత్నాలు’ కోసం ఎదురు చూస్తున్నట్లే ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల మోతే.